
న్యూఢిల్లీ: ప్రధాని మోడీ ఆదివారం (మార్చి 9) ఢిల్లీ ఎయిమ్స్కు వెళ్లారు. అనారోగ్యంతో ఎయిమ్స్లో చికిత్స పొందుతోన్న భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకడ్ను పరామర్శించారు. ధన్కడ్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు ప్రధాని మోడీ. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఉప రాష్ట్రపతి త్వరగా కోలుకోవాలని మోడీ ఆకాంక్షించారు.
ఉప రాష్ట్రపతి ధన్ కడ్ను పరామర్శించిన విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రధాని మోడీ వెల్లడించారు. ‘‘ఎయిమ్స్కు వెళ్లి ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకడ్ ఆరోగ్యం గురించి ఆరా తీశాను. ఆయన ఆరోగ్యం బాగుండాలని, త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా కూడా శనివారం (మార్చి 8) ఎయిమ్స్ను సందర్శించి ధంకడ్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
ALSO READ | ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్కు తీవ్ర గుండెపోటు.. ఆసుపత్రికి తరలింపు
కాగా, ఆదివారం (మార్చి 9) తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఉపరాష్ట్రపతి ధంకడ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు, సిబ్బంది హుటాహుటిన ఆయనను ఎయిమ్స్కు తరలించారు. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ధంకడ్కు క్రిటికల్ కేర్ యూనిట్ (సిసియు)లో చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ధంకడ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది.