
పహల్గాలో ఉగ్రవాదులు నరరూప రాక్షసుల అవతారాన్ని దాల్చారు. మహిళలను వదిలేసి మగవారిపై పాయింట్ బ్లాక్ లో బుల్లెట్ల వర్షం కురిపించారు. టెర్రరిస్టులు పైశాచికత్వాన్ని చూపిస్తూ కలిమా చదవమన్నారని అది చదవలేకపోవడంతో నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు .
భార్యా బిడ్డలను చెట్టు వెనకకు తోసి..
మధ్యప్రదేశ్ లోని అలీరాజ్ పూర్ కు చెందిన 50 ఏండ్ల సుశీల్ నథానియెల్ ఎల్బీసీలో బ్రాంచ్ - మేనేజర్ గా పనిచేస్తున్నారు. భూతల స్వర్గంగా పేరు పొందిన కాశ్మీర్ లో పర్యటించాలని ఎన్నో ఏండ్లుగా కలగన్న ఆయన చివరకు ఆ కలను నిజం చేసుకోబోయి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
టెర్రరిస్టులు విచక్షణారహితంగా కాల్పులు మొదలు పెట్టగానే.. భార్య, బిడ్డ, కొడుకుకు రక్షణగా నిలిచి, వారిని ఓ చెట్టు వెనకకు తోసేశాడు. చివరకు వాళ్లను రక్షించుకున్నాడు కానీ.. ఉగ్రమూకల తూటాల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు. అతడి కుటుంబానికి ఈ పర్యటన జీవితాంతం వెంటాడే పీడకలగా మిగిలిపోయింది. చివరకు మా అన్న అక్కడికి వెళ్లగలిగారు. కానీ ఇక ఎప్పుడూ తిరిగి రాలేరు... అని సుశీల్ సోదరుడు సంజయ్ కుమ్రా వత్ గద్గద స్వరంతో చెప్పుకుంటున్నాడు.
టెర్రరిస్టులు ముందుగా కలిమా చదవాలని అడిగారట. చదవలేకపోవడంతో ఆరా తీసి, అతడు క్రిస్టియన్ అని తెలుసుకున్నాక కాల్పులు జరిపారట. వేరే మతం అయినంత మాత్రాన చంపేస్తారా? ఇది కేవలం టెర్రర్ అటాక్ కాదు.. హేట్ క్రైమ్ అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ దాడిలో బ్యాంకు ఉద్యోగి అయిన సుశీల్ కూతురు ఆకాంక్ష కు కాలిలో బుల్లెట్ గాయం కాగా, టీనేజ్ లో ఉన్న కొడుకు ఆస్టిన్ షాక్ లోకి వెళ్లిపోయాడు ..
నేలకొరిగే దాకా తూటాలు కురిపించారు..
ఏపీలోని నెల్లూరుకు చెందిన 41 ఏండ్ల భరత్ భూషణ్ బెంగళూరులో టెకీగా పనిచేస్తున్నారు. ఆయన భార్య డాక్టర్ సుజాత, కొడుకుతో కలిసి వెకేషన్ కు జమ్మూకాశ్మీర్ వెళ్లారు. సంఘటన జరిగిన తర్వాత తన కూతురుతో ఫోన్ లో మాట్లాడానని.. సుజాత తల్లి మీడియాకు వెల్లడించారు. టూరిస్టులను చుట్టుముట్టిన టెర్రరిస్టులు.. మీరు హిందువులా? అని అడిగి మరీ కాల్చి చంపారని తన కూతురు చెప్పింది.
కేవలం హిందూ అయినందుకే నా అల్లుడిని చంపేశారు. మహిళలను, పిల్లలను వదిలేసి కేవలం మగవాళ్లపై మాత్రమే నేలకు ఒరిగేదాకా తూటాల వర్షం కురిపించారని తెలిపింది అని ఆమె కన్నీటిపర్యంతం అవుతూ చెప్తున్నారు. భరత్ భూషణ్ ను కూడా ముందుగా తలపై కాల్చారని, ఆ తర్వాత కింద పడిపోయే దాకా వరుసగా బుల్లెట్లు పేల్చారని తెలిపారు.