మేడారం (జయశంకర్ భూపాలపల్లి), వెలుగు: మేడారం పోలీసుల నిఘాలోకి వెళ్లింది. జాతర కోర్ ఏరియాలో పోలీసులు 432 సీసీ కెమెరాలను అమర్చారు. అమ్మవార్ల గద్దెల దగ్గర మొదలుకొని పార్కింగ్ ప్లేస్లు, రోడ్లపై, మేడారం చుట్టుపక్కల అన్ని ప్రాంతాల్లో ఈ సీసీ కెమెరాలను బిగించారు. వాహనాలను, భక్తుల సంఖ్యను లెక్కించేందుకు సర్వైలెన్స్ కెమెరాలు, భద్రత కోసం 5 డ్రోన్ కెమెరాలను వాడుతున్నారు.
వీటన్నింటిని మేడారంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ 24 గంటల పాటు పనిచేస్తుంది. ఇక్కడ మూడు షిఫ్టుల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీంతో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగిన పోలీసులకు క్షణాల్లో తెలిసిపోతుంది. దుకాణాలు, గుడారాలు, గద్దెల వద్ద డాగ్, బాంబ్ స్క్వాడ్స్ తో తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.