- వివరాలు వెల్లడించిన మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్
మెదక్, వెలుగు: ఆన్లైన్ బెట్టింగ్ కోసం చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు ఆరెస్ట్ చేశారు. మెదక్ డీఎస్పీ ఆఫీస్లో ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. మెదక్ పట్టణం ఫతేనగర్ కు చెందిన మహమ్మద్ అబ్దుల్ ఖాదీర్, మహమ్మద్ అబ్దుల్ షఫీ ఆన్లైన్ బెట్టింగ్కు అలవాటు పడి, డబ్బులు పోగొట్టుకున్నారు. బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చడంతో పాటు మళ్లీ బెట్టింగ్ పెట్టేందుకు అవసరమైన డబ్బుల కోసం చైన్ స్నాచింగ్ చేయడం మొదలుపెట్టారు.
జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలో మహిళల మెడలో నుంచి పుస్తెలతాళ్లను లాక్కెళ్లినట్లు ఎస్పీ చెప్పారు. పలు చోట్ల చైన్ స్నాచింగ్కు విఫలయత్నం చేశారని పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఔరంగాబాద్ శివారులో వాహనాల తనిఖీలో భాగంగా బైక్ పై అనుమానాస్పదంగా వెళ్తున్న వారిని వెంబడించి పట్టుకున్న ట్లు తెలిపారు. వారిని విచారించగా మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడినట్టు అంగీకరించారని ఎస్పీ వివరించారు. వారి నుంచి 6 తులాల రెండు పుస్తెల తాళ్లు రికవరీ చేసినట్లు చెప్పారు. దొంగలను పట్టుకున్న మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, హవేలి ఘనపూర్ ఎస్సై సత్యనారాయణను ఎస్పీ అభినందించారు.