
- సికింద్రాబాద్ లాలాపేటలో ఘటన
సికింద్రాబాద్, వెలుగు : పేకాటస్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేయగా తప్పించుకోబోయి ఓ వ్యక్తి మూడో అంతస్తుపై నుంచి దూకి చనిపోయాడు. ఈ ఘటన సికింద్రాబాద్ లోని లాలాపేటలో జరిగింది. లాలాపేటలోని శాంతినగర్కు చెందిన వినయ్ కుమార్ (35) ప్రైవేటు ఉద్యోగి. గురువారం రాత్రి లాలాపేటలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో గల ఓ భవనంపై కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారు.
అయితే, వినయ్ కుమార్ కూడా రాత్రి 10 గంటల సమయంలో అక్కడికి వెళ్లాడు. ఈ క్రమంలో లాలాపేటలో పేకాట ఆడుతున్నట్టు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసులను గమనించిన కొందరు జూదరులు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ క్రమంలో వినయ్ కుమార్ తప్పించుకునే ప్రయత్నంలో మూడో అంతస్తు పైనుంచి కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు అంబులెన్స్లో సికింద్రాబాద్లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వినయ్ కుమార్ మృతి చెందాడు.