అనుమానితుడిపై పోలీసుల దాడి

అనుమానితుడిపై పోలీసుల దాడి
  • పోలీసుల థర్డ్  డిగ్రీతో తీవ్ర గాయాలు
  • గుట్టుచప్పుడు కాకుండా వైద్యం
  • దెబ్బలు ఉండడంతో రిమాండ్  రిజెక్ట్
  • ఘటనపై ఎస్పీ ఎంక్వైరీ

నల్గొండ, వెలుగు: హత్య కేసులో అనుమానితుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి విచారణ పేరుతో పోలీసులు తీవ్రంగా కొట్టడంతో గాయాలైన ఘటన నల్గొండ జిల్లా గుడిపల్లి పోలీస్ స్టేషన్ లో వెలుగు చూసింది. అనుమానితుడికి తీవ్రంగా గాయాలవడంతో గుట్టు చప్పుడు కాకుండా ట్రీట్​మెంట్​ చేయించి రిమాండ్ కు పంపే క్రమంలో అతడి గాయాలు బయటపడడంతో రిజెక్ట్  చేసినట్లు సమాచారం. ఈ ఘటన పై ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఎంక్వైరీకి ఆదేశించినట్లు తెలిసింది.. వివరాలిలా ఉన్నాయి.. 

మూడు రోజుల కింద నల్గొండ జిల్లా గుడిపల్లి గ్రామానికి చెందిన పోశంరెడ్డి నారాయణరెడ్డి హత్యకు గురయ్యాడు. ఈ కేసులో రెండు రోజుల కింద ఓ అనుమానితుడిని పోలీసులు అడుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేశారు. అయితే ఎంక్వైరీ పేరుతో పోలీసులు అనుమానితుడిని స్టేషన్ కు తీసుకువచ్చి అతనిపై థర్డ్  డిగ్రీ ప్రయోగించడంతో తలపై గాయమైంది. దీంతో పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. 

కోర్టు ఆదేశాలతో దేవరకొండ జైలుకు రిమాండ్  తరలించగా, గాయాలు ఉండడంతో జైలు సిబ్బంది రిమాండ్​కు నిరాకరించారు. దీంతో దేవరకొండ సబ్  జైల్  నుంచి నల్గొండ సబ్  జైల్ కు తరలించారు. అక్కడ సైతం ఇదే పరిస్థితి ఎదురు కావడంతో మరోసారి అనుమానితుడిని రీ టెస్ట్  నిర్వహించి రిమాండ్ కు తరలించారు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా ఒక అధికారి బాధితుడికి రూ.లక్ష ట్రీట్​మెంట్  ఖర్చుల కోసం అందించినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి రిపోర్టు ఇవ్వాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్  ఇంటలిజెన్స్  వర్గాలను ఆదేశించారు.