
పెనుబల్లి, వెలుగు: హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి ప్రైవేట్ భూమిలో ప్రవేశించినందుకు పదిమంది అటవీశాఖ ఆఫీసర్లపై పోలీస్ కేసు నమోదైంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి గొల్లగూడెం రెవెన్యూ లోని 129/1 సర్వే నెంబర్లో సోమరాజు జైకాంత్ అనే వ్యక్తి పేరు మీద ఎకరం వ్యవసాయ భూమి ఉంది. ఇది వారసత్వ భూమిగా రికార్డుల్లో కన్పిస్తోంది. అయితే ఆ భూమి తమ ఆధీనంలో ఉన్నట్లు అటవీశాఖ ఆఫీసర్లు ఫెన్సింగ్ వేసి బోర్డు ఏర్పాటు చేశారు. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో జైకాంత్ పిటిషన్ వేశారు. ఆ భూమి ప్రైవేట్వ్యక్తికి చెందిన భూమిగా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి అటవీశాఖ ఆఫీసర్లు భూమిని ఖాళీ చేయకపోవడంతో వారిపై వీఎం బంజర్ పోలీసులకు జైకాంత్ ఫిర్యాదు చేశారు. దీంతో పదిమంది అటవీశాఖ ఆఫీసర్లపై సెక్షన్103 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.