రూ.500 ఎక్కువ అడిగిందని..బండరాయితో కొట్టి, పెట్రోల్ ​పోసి తగలబెట్టాడు

రూ.500 ఎక్కువ అడిగిందని..బండరాయితో కొట్టి, పెట్రోల్ ​పోసి తగలబెట్టాడు
  • మహిళ హత్య కేసును ఛేదించిన మేడ్చల్ పోలీసులు

జీడిమెట్ల, వెలుగు: మేడ్చల్ పీఎస్ ​పరిధిలో మహిళ దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలిని నిజామాబాద్ ​జిల్లాకు చెందిన ఇరుగదిండ్ల శివానంద (45)గా గుర్తించారు. కోరిక తీర్చి, మరో రూ.500 ఎక్కువగా అడిగినందుకు ఆమెను నిందితుడు దారుణంగా హతమార్చినట్లు తేల్చారు. ఈ కేసు వివరాలను డీసీపీ కోటిరెడ్డి సోమవారం వెల్లడించారు. శివానంద(45) కుటుంబ సభ్యులతో గొడవపడి సిటీకి వచ్చి కూలీ పనులు చేసుకుంటూ కుషాయిగూడలో నివాసం ఉంటోంది. 

డబ్బులు తీసుకుని సెక్స్​వర్క్​గా కూడా పనిచేస్తోంది. ఈ నెల 23న మధ్యాహ్నం మేడ్చల్ బస్టాప్ వద్ద ఆమె వేచి ఉండగా, శామీర్​పేట మజీద్​పూర్​లో ఉంటూ స్టోన్​ కట్టర్​గా పనిచేస్తున్న కరీంనగర్​కమలాపూర్​కు చెందిన షేక్​ఇమామ్ (37) వచ్చి మాటలు కలిపాడు. తన కోరిక తీర్చితే రూ.500 ఇస్తానని చెప్పడంతో అంగీకరించింది. ఇద్దరూ కలిసి ఇమామ్​బైక్​పై మునీరాబాద్​ ఓఆర్ఆర్​ కింద కల్వర్ వద్దకు వెళ్లారు. కోరిక తీర్చిన తర్వాత ఆమె మరో రూ.500 అదనంగా అడగడంతో అందుకు షేక్​ఇమామ్​నిరాకరించాడు. 

ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరగగా, ఇమామ్​ఆమెను బండరాయితో కొట్టి చంపేశాడు. అనంతరం ఎవరూ గుర్తుపట్టకుండా ఉండడానికి పెట్రోల్​పోసి నిప్పంటించాడు. మృతురాలి చేతిపై ఉన్న పచ్చబొట్ల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని అరెస్ట్ ​చేసి సోమవారం రిమాండ్​కు తరలించారు.