![ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు చర్యలు](https://static.v6velugu.com/uploads/2025/02/police-commissioner-sunil-dutt-has-ordered-officials-to-take-stringent-measures-to-control-illegal-sand-trafficking-in-khammam-district_1HtpryFnoR.jpg)
ఖమ్మం, వెలుగు : జిల్లాలో ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. అడిషనల్ డీసీపీలు నరేశ్కుమార్, ప్రసాద్ రావుతో కలిసి మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ సాయినాథ్, భూగర్భ జల శాఖ అసిస్టెంట్ అధికారి రమేశ్, ఇతర అధికారులతో మంగళవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నిర్మూలించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్దేశించిన ప్రాంతాల్లోనే రాయల్టీ చెల్లించి ఇసుక తవ్వకాలు చేపట్టాలని తెలిపారు.
జిల్లాలోని వాగులు, నది పరివాహక ఇసుక తవ్వకాల ప్రాంతాలను గుర్తించి నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. చెక్ పోస్టుల ద్వారా ఇసుక అక్రమ రవాణాపై నిరంతరం పర్యవేక్షణ ఉంచాలన్నారు. ఇసుక అక్రమంగా రవాణా చేసినా, నిల్వ ఉంచినా వెంటనే చట్ట ప్రకారం జరిమానాలు విధించడం, కేసులు నమోదు చేయడం, వాహనాలను జప్తు చేయాలని చెప్పారు. జీరో బిల్లులు, డబుల్ ట్రిప్, అదనపు లోడ్, నకిలీ బిల్లులు, తప్పుడు వాహనంలో రవాణా తదితర ఉల్లంఘన, అక్రమాలపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
జిల్లాలో కారేపల్లి- కొత్త లింగాల క్రాస్ రోడ్, ముదిగొండ- వల్లబి, బోనకల్- వత్సవాయి, మధిర టౌన్- ఆత్కూర్ క్రాస్ రోడ్, సతుపల్లి టౌన్ - గంగారామ్ రింగ్ సెంటర్ చెక్ పోస్టులలో మైనింగ్ స్టాఫ్ తో పాటు పోలీస్ సిబ్బంది మూడు షిఫ్టులలో 24 గంటలు పనిచేస్తాయని పోలీస్ కమిషనర్ వివరించారు.