పుట్టిందేమో పాకిస్తాన్లో.. 19 ఏళ్లుగా ఉంటుందేమో ఏపీలోని ధర్మవరంలో.. ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితేంటో..?

పుట్టిందేమో పాకిస్తాన్లో.. 19 ఏళ్లుగా ఉంటుందేమో ఏపీలోని ధర్మవరంలో.. ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితేంటో..?

ధర్మవరం: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్‌లోని పాక్ పౌరులను వెనక్కి పంపాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌లో జన్మించిన ఒక అమ్మాయి 19 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఉన్న ధర్మవరం పట్టణంలో నివసిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

కర్ణాటకలోని బళ్లారికి చెందిన మహబూబ్ పీరన్ దేశ విభజన సమయంలో పాకిస్తాన్ వెళ్లిపోయారు. ఆయనకు అక్కడే ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు పుట్టారు. చిన్న కూతురు జీనత్ పీరన్‌ను ధర్మవరంలోని తన చెల్లెలి కొడుకు రఫీక్ అహ్మద్‌కు ఇచ్చి 1989లో వివాహం జరిపించారు. ఈ జంటకు కొడుకు పుట్టాడు.

1998లో జీనత్ రెండోసారి గర్భం దాల్చింది. అయితే, ఆ సమయంలో పాక్‌లోని తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని సమాచారం రావడంతో ఆమె చూసేందుకు వెళ్లింది. తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో భారత్-పాక్ మధ్య కార్గిల్ యుద్ధం ప్రారంభమైంది. దీంతో ఆమె అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అప్పటికే నిండు చూలాలు కావడంతో అక్కడే ఆమె రంశా రఫీక్‌కు జన్మనిచ్చింది. 2005లో జీనత్ తిరిగి ధర్మవరం చేరుకుంది.

రంశా రఫిక్ పాకిస్థాన్‌లో పుట్టడంతో ఆమెకు అక్కడి పౌరసత్వం లభించింది. తర్వాత ధర్మవరం వచ్చి చదువు కొనసాగించినప్పటికీ రంశా భారత పౌరసత్వం కోసం ప్రయత్నించలేదు. ఈ క్రమంలో 2018లో పాక్ పౌరసత్వాన్ని పునరుద్ధరించుకున్నారు. 2028 వరకు పౌరసత్వం మనుగడలో ఉంటుంది. 2023లో భారత పౌరసత్వం కోసం రంశా దరఖాస్తు చేసుకున్నా తిరస్కరణకు గురైంది. 

ఈ క్రమంలో పాక్ పౌరసత్వం ఉన్న ఆమె భారత్‌లో ఉంటుందా? అధికారులు ఆమెను తిప్పి పంపుతారా? అనే అంశం ప్రస్తుతం ధర్మవరం పట్టణంలో చర్చనీయాంశమైంది. జమ్మూకాశ్మీర్‎లో టెర్రర్ దాడి జరిగిన క్రమంలో.. పాకిస్తాన్ పౌరుల వీసాలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 27 లోగా దేశం విడిచి వెళ్లాలంటూ ఆదేశించింది. నిన్నటితో(ఏప్రిల్ 27, 2025) కేంద్రం ఇచ్చిన డెడ్ లైన్ కూడా ముగిసింది.