
హైదరాబాద్ ఎంఎంటీఎస్ లో యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. నిందితుడు మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా గౌడవల్లి గ్రామానికి చెందిన జంగం మహేశ్ గా గుర్తించారు. జంగం మహేశ్ ఫోటోను బాధితురాలికి చూపించిన పోలీసులు .. రైలులో తన పై లైంగిక దాడికి యత్నించింది మహేశేనని ఫోటో ఆధారంగా గుర్తించింది యువతి.
ఏడాది క్రితమే మహేశ్ ను అతని భార్య వదిలేసింది. తల్లిదండ్రులు కూడా చనిపోవడంతో ఒంటరిగా ఉంటున్నాడు. గంజాయికి బానిసైన మహేశ్ నేరాలకు పాల్పడుతున్నాడు. ప్రస్తుతం మహేశ్ పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.
అసలేం జరిగింది?
ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన మహిళ (23) మేడ్చల్లోని ఉమెన్స్ హాస్టల్ లో ఉంటూ స్విగ్గీలో పని చేస్తున్నది. ఈ నెల 22న మధ్యాహ్నం మేడ్చల్నుంచి సికింద్రాబాద్రైల్వే స్టేషన్సమీపంలోని ఓ సెల్ఫోన్ రిపేరింగ్ షాపుకు తన మొబైల్ డిస్ప్లే మార్చుకునేందుకు వచ్చింది. మొబైల్ రిపేర్చేయించుకుని సుమారు రాత్రి ఏడున్నరకు ప్లాట్ఫామ్ నంబర్10లో తెల్లాపూర్-–మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలెక్కింది. అది మహిళల బోగీ. అప్పడు ఆ బోగీలో సదరు యువతితో పాటు మరో ఇద్దరు మహిళలు మాత్రమే ఉన్నారు. అల్వాల్లో ఆ ఇద్దరూ దిగిపోయారు. తర్వాత యువతి మాత్రమే బోగీలో ఉంది. అప్పుడే ఓ యువకుడు బోగీలోకి ఎక్కాడు. యువతిపై లైంగికదాడికి ప్రయత్నించగా.. భయంతో ఆమె రైలులోంచి గుండ్లపోచంపల్లి ఎంఎంటీఎస్స్టేషన్కు అర కిలోమీటర్దూరంలో బయటకు దూకింది. కంకర రాళ్లపై పడటంతో బాధితురాలి తలకు తీవ్ర గాయాలయ్యాయి. చేతి మణికట్టు విరిగిపోయింది. మొఖం, గదవ, శరీరం నుంచి రక్తం పోతుండడంతో అటువైపు వెళ్తున్న బాటసారులు గమనించి పోలీసులకు, అంబులెన్స్కు సమాచారం అందించారు. అక్కడి నుంచి గాంధీ దవాఖానకు తరలించారు