ప్రధాని మోడీ కాన్వాయ్ రిహార్సల్ డ్రిల్.. మధ్యలో వెళ్లాడని బాలుడి మొఖం పగలగొట్టిన పోలీస్

ప్రధాని మోడీ కాన్వాయ్ రిహార్సల్ డ్రిల్.. మధ్యలో వెళ్లాడని బాలుడి మొఖం పగలగొట్టిన పోలీస్

గాంధీనగర్: ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్‎లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం (మార్చి 7) సూరత్‎లోని లింబాయత్‎లో జరగనున్న ఓ సభలో ఆయన పాల్గొననున్నారు. ప్రధాని మోడీ రాక నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా లింబాయత్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా లింబాయత్‎లో ప్రధాని మోడీ కాన్వాయ్ ప్రయాణించనున్న ప్రాంతంలో గురువారం (మార్చి 6) రిహార్సల్ డ్రిల్ నిర్వహించారు. 

ఈ సమయంలో ఓ బాలుడు రిహార్సల్ నిర్వహిస్తోన్న రోడ్డుపైకి సైకిల్‎పై సడెన్‎గా వచ్చాడు. దీంతో ప్రధాని మోడీ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తోన్నపోలీస్ అధికారి బిజె గధ్వి తీవ్ర ఆగ్రహానికి గురై బాలుడిపై దాడి చేశాడు. బాలుడి మొఖంపై పోలీస్ అధికారి దాడి చేసిన ఘటన మొత్తం అక్కడ ఉన్న  సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. బాలుడి పట్ల పోలీస్ ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. 

దీంతో నష్ట నివారణ చర్యలకు దిగిన పోలీసులు బాలుడిపై దాడి చేసిన పోలీస్ ఆఫీసర్‎పై చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు బిజె గధ్విని ప్రధాని భద్రతా ఏర్పాట్ల విధుల నుంచి తొలగిస్తూ మోర్బీకి బదిలీ చేసినట్లు తెలిపారు. అలాగే.. బాలుడిపై దాడి చేసిన గధ్వి ఇంక్రిమెంట్‏ను సంవత్సరం పాటు నిలిపివేసినట్లు వెల్లడించారు. ఇటువంటి చర్యలను ఏ మాత్రం ఉపేక్షించమని హెచ్చరించారు.