- మంటలంటుకోవడంతో ప్రమాదం
మెదక్ టౌన్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి దీక్ష భగ్నం, అరెస్ట్ను నిరసిస్తూ గురువారం మెదక్ రాందాస్ చౌరస్తాలో బీజేపీ ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ఈ క్రమంలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీ యాదవ్కు మంటలంటుకున్నాయి. ఆయన చెంపకు, ఎడమ చేతికి గాయాలయ్యాయి.
దీంతో ఆయనను స్థానిక ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అలాగే ఈ ఘటనలో మెదక్ టౌన్ ఎస్సై పోచయ్య తల కుడి భాగం వైపు గాయాలయ్యాయి. దీంతో అతడిని మెదక్లోని దవాఖానకు తరలించారు. పోలీసుల తీరును బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, బీజేవైఎమ్ జిల్లా కార్యదర్శి సతీశ్ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులపై పోలీసులు అత్యుత్సాహం చూపారని మండిపడ్డారు.