పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి యశస్వీని రెడ్డి అత్తామామలు అనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. 2023, నవంబర్ 28వ తేదీ మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారాలు ముగిసిన తర్వాత మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్న ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఎన్నికల కోడ్ ఉన్నందున.. అమెరికా పౌరసత్వం కలిగిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు ఇక్కడ ఉండకూడదని, తిరిగి వెళ్లిపోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, వారు నోటీసులు తీసుకోవడానికి నిరాకరించారు. చర్లపాలెం గ్రామం మా సొంత ఊరు అని... ఆ ఊరిని మేము దత్తత తీసుకున్నామని.. ఇక్కడ ఉండేందుకు మాకు హక్కు ఉందని ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు పోలీసులకు తెలిపారు.
దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన పోలీసులు.. తొర్రూరు డిఎస్పీ వెంకటేశ్వర బాబు అధ్వర్యంలో ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులకు మరోసారి నోటీసులు ఇచ్చేందుకు ఎలక్షన్ ఫ్లయింగ్ స్కాడ్ అధికారులతో కలిసి క్యాంప్ ఆఫీస్ కు వెళ్ళారు. భారీగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దీంతో మేము ఏం పాపం చేశామని.. మా కోడలు ఎలక్షన్ లో పోటీ చేస్తుంటే మేము ఇక్కడ ఉండకూడదా అని ఝాన్సీ రెడ్డి కన్నీరు పెట్టారు. ఆడవాళ్లు అని చూడకుండా.. ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంటని ఆమె ప్రశ్నించారు.