మెదక్​ బరిలో నిలిచేదెవరు..?

మెదక్​ బరిలో నిలిచేదెవరు..?
  • బెస్ట్​ క్యాండిడేట్స్​ కోసం వెతుకుతున్న పొలిటికల్​ పార్టీలు
  • కాంగ్రెస్​ అప్లికేషన్ల స్వీకరణ
  • బీజేపీ అభిప్రాయ సేకరణ

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాడానికి  బెస్ట్​ క్యాండిడేట్స్​కోసం పొలిటికల్​ పార్టీలు వెతుకుతున్నాయి.  ఇప్పటికే కాంగ్రెస్ ఆశావహుల నుంచి అప్లికేషన్లు స్వీకరించగా, బీజేపీ ఫీల్డ్​లెవల్​సర్వేలు చేయిస్తూ, నియోజకవర్గ స్థాయి మీటింగ్ లు నిర్వహిస్తూ క్యాడర్​ నుంచి అభిప్రాయ సేకరణ చేస్తోంది. ఇక బీఆర్ఎస్ నుంచి చాలా మంది రేసులో ఉండగా ఎవరిని బరిలోకి దించాలనే దానిపై పార్టీ హైకమాండ్​ కసరత్తు చేస్తోంది.   

11 మంది దరఖాస్తు

అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్​నుంచి టికెట్ ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇటీవల పార్టీ హైకమాండ్​ ఆశవహుల నుంచి అప్లికేషన్లు ఆహ్వానించగా 11 మంది అప్లై చేసుకున్నారు. సిద్దిపేటకు చెందిన పీసీసీ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి, అక్బర్​ పేట - భూంపల్లి మండలం ఖాజీపూర్ కు​చెందిన మద్దుల సోమేశ్వర్​రెడ్డి, దుబ్బాక అసెంబ్లీ స్థానంలో పోటీచేసి ఓడిపోయిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి, మల్కాజ్​గిరి మాజీ ఎమ్మెల్యే  మైనంపల్లి హన్మంతరావు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఆయన భార్య నిర్మల మరో  8 మంది అప్లై చేసుకున్నారు. సామాజిక సమీకరణలు, ప్రత్యర్థి అభ్యర్థి ఎవరుంటారనేదాన్ని దృష్టిలో పెట్టుకొన కాంగ్రెస్​ అభ్యర్థిని ఖరారు చేస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఫీల్డ్​ సర్వేలు.. క్యాడర్ ​అభిప్రాయాలు 

బీజేపీ మెదక్​లోక్​సభఅభ్యర్థి కోసం ఎంపిక ప్రక్రయ మొదలు పెట్టింది. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్​ రావు​, మాజీ మంత్రి ఈటల రాజేందర్, 2018 ఎన్నికల్లో మెదక్​అసెంబ్లీ స్థానంలో పోటీచేసి ఓడిపోయిన ఆకుల రాజయ్యతోపాటు మరికొందరు నేతలు మెదక్ లోక్​సభ టికెట్ ఆశిస్తున్నారు. కాగా పార్టీ హైకమాండ్​లోక్​సభ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి పార్టీ క్యాడర్​అభిప్రాయాలు సేకరించారు. ఇటీవల మెదక్ జిల్లా మనోహరాబాద్​లో ఈ మీటింగ్​ నిర్వహించగా పార్టీ నుంచి వచ్చిన ఆఫీస్​ బేరర్లు, పార్టీ మండల శాఖ అధ్యక్షులు, ఆ పై స్థాయి లీడర్లతో మాట్లాడి లోక్​సభ ఎన్నికల్లో మెదక్​అభ్యర్థి ఎవరైతే గెలుస్తారని అడిగి తెలుసుకున్నారు. పార్టీ క్యాడర్​ ఎక్కువగా ఎవరివైపు మొగ్గు చూపారనేదానిపై నివేదిక రూపొందించి పార్టీ హైకమాండ్​కు అందజేసినట్టు తెలిసింది. దీంతోపాటు ఫీల్డ్​లెవల్​లో నిర్వహించిన వివిధ సర్వేల్లో వెల్లడైన అభిప్రాయాలను క్రోడీకరించి అభ్యర్థిత్వం విషయంలో ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

అధినేతదే తుది నిర్ణయం ​ 

మెదక్ లోక్​సభ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్​లు ఉండగా గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుచోట్ల బీఆర్​ఎస్​ గెలుపొందడంతో లోక్​సభ ఎన్నికల్లో గెలుపు పక్కా అని బీఆర్ఎస్​ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్​ టికెట్​ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. నర్సాపూర్​ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, పటాన్​చెరుకు చెందిన గాలి అనిల్ కుమార్, సంగారెడ్డికి చెందిన బీరయ్య యాదవ్​ ఎంపీ టికెట్​ఆశిస్తున్నారు. పార్టీ హైకమాండ్​ పరిశీలనలో ఎమ్మెల్సీలు వెంకట్రామ్​రెడ్డి, కవిత పేర్లు ఉన్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాగా మెదక్ ఎంపీ టికెట్ విషయంలో పార్టీ అధినేత కేసీఆర్​దే తుది నిర్ణయం కానుంది.