
- లాస్ట్ (ఏడో) ఫేజ్ లో 8 రాష్ట్రాలు, యూటీల్లోని 57 సీట్లకు ఎన్నికలు
- అత్యధికంగా బెంగాల్లో 70.03%
- బిహార్లో 51.07 % ఓటింగ్
- లోక్ సభతోపాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలూ పూర్తి
- ఇయ్యాల్నే అరుణాచల్, సిక్కిం అసెంబ్లీ ఓట్ల లెక్కింపు
- దేశవ్యాప్తంగా ఎల్లుండి లోక్ సభ ఓట్ల కౌంటింగ్
న్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికలకు దేశవ్యాప్తంగా పోలింగ్ పూర్తయింది. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా శనివారం నిర్వహించిన చివరి (ఏడో) విడత పోలింగ్తో మారథాన్ ఎలక్షన్స్ ప్రశాంతంగా ముగిశాయి. తుది దశలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 నియోజకవర్గాల్లో నిర్వహించిన పోలింగ్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఓటు హక్కును వినియోగించున్నారు.
మొత్తంగా 58 శాతం పోలింగ్ నమోదైంది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈ దశలోనే పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. చివరి విడతలో పంజాబ్లోని మొత్తం 13 స్థానాలకు, హిమాచల్ప్రదేశ్లో 4, ఉత్తరప్రదేశ్లో 13, పశ్చిమ బెంగాల్లో 9, బిహార్లో 8, ఒడిశాలో 6, జార్ఖండ్లో 3 స్థానాలతో పాటు చండీగఢ్ స్థానానికి పోలింగ్ జరిగింది. వీటితో పాటు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా 42 స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక నిర్వహించారు.
బెంగాల్లో అత్యధికం.. బిహార్లో అత్యల్పం
ఆఖరి విడత ఎన్నికల్లో శనివారం రాత్రి 10.45 గంటల సమయానికి మొత్తం 60.37 శాతం పోలింగ్ నమోదైందని ఈసీ ప్రకటించింది. అత్యధికంగా వెస్ట్ బెంగాల్ లో 70.03 శాతం, అత్యల్పంగా బిహార్ లో 51.70 శాతం ఓటింగ్ జరిగినట్టు వెల్లడించింది. జార్ఖండ్ లో 70.01 శాతం, యూపీలో 55.60, హిమాచల్ లో 68.78, పంజాబ్ లో 56.44, చత్తీస్ గఢ్ లో 67.90, ఒడిశాలో 68.72 శాతం ఓటింగ్ నమోదైంది.
ముగిసిన సార్వత్రిక సమరం
శనివారం జరిగిన తుది దశ పోలింగ్తో సార్వత్రిక సమరం ముగిసింది. ఏప్రిల్ 19న మొదటి దశతో ప్రారంభమైన పోలింగ్ ఏడో దశతో పూర్తయింది. మొదటి దశలో 66.14 శాతం, రెండో దశలో 66.17, మూడో దశలో 65.68, నాలుగో దశలో 69.16, ఐదో దశలో 62.2, ఆరో దశలో 63.36 శాతం పోలింగ్ నమోదైంది. లోక్సభ ఎన్నికలతోపాటే ఏపీ, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించి, వరుసగా మూడోసారి అధికార పీఠమెక్కాలని బీజేపీ ప్రయత్నిస్తుండగా, ఆ విజయానికి అడ్డుకట్ట వేయాలని ఇండియా కూటమి యత్నిస్తోంది. అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీతోపాటు లోక్సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ మంగళవారం జరగనున్నాయి.
బెంగాల్లో హింసాత్మక ఘటనలు
పోలింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జాదవ్పూర్ నియోజకవర్గ పరిధిలోని భాంగర్ సతులియా ప్రాంతంలో సీపీఎం, ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్) మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలు నాటుబాంబులతో దాడి చేసుకోగా, ఐఎస్ఎఫ్ సభ్యులకు గాయాలయ్యాయి. సౌత్ 24 పరగణాస్ డిస్ట్రిక్ట్లోని కుల్తాలీలో ఓ అల్లరి మూక పోలింగ్ స్టేషన్లోకి ప్రవేశించి, ఈవీఎంను ఎత్తుకెళ్లింది. అనంతరం ఓ చెరువులో పడేసింది.
బూత్లలోకి కొంతమంది పోలింగ్ ఏజెంట్లను రాకుండా అడ్డుకున్నందుకు కోపంతో ఈ పని చేశారు. ఈ ఘటనపై సెక్టార్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇక్కడ మళ్లీ ఫ్రెష్ బ్యాలెట్తో పోలింగ్ ప్రారంభించినట్టు పశ్చిమ బెంగాల్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి కంచుకోట అయిన డైమండ్ హార్బర్లో టీఎంసీ, బీజేపీ మద్దతుదారుల మధ్య ఘర్షణ చెలరేగింది. పోలింగ్ సందర్భంగా టీఎంసీ అవకతవకలకు పాల్పడిందని బీజేపీ అభ్యర్థి అభిజిత్ దాస్ ఆరోపించగా, దానిని టీఎంసీ ఖండించింది.
గ్రీన్ టవల్ తో బూత్లోకి లాలూ.. ఈసీకి బీజేపీ కంప్లయింట్
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తన ఓటు హక్కును వినియోగించుకునే టైంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని బీజేపీ ఆరోపించింది. ఈ మేరకు ఆయనపై బీజేపీ బిహార్ రాష్ట్ర లీగల్ సెల్ ప్రెసిడెంట్ ఈసీకి ఫిర్యాదు చేశారు. "ఆర్జేడీ చీఫ్ తన భార్య రబ్రీ దేవి, కుమార్తె రోహిణి ఆచార్యతో కలిసి పాట్నాలోని వెటర్నరీ కాలేజీ గ్రౌండ్ లో పోలింగ్ బూత్కు వెళ్లారు.
ఆ టైంలో ఆయన తన పార్టీ సింబల్ తో కూడిన ఆకుపచ్చ రంగు టవల్ను మెడలో వేసుకున్నారు. పోలింగ్ బూత్ వద్ద పార్టీ గుర్తును ప్రదర్శించడమంటే తన పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను కోరడమే. అందువల్ల లాలూపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకోండి" అని ఈసీని బీజేపీ బిహార్ రాష్ట్ర లీగల్ సెల్ ప్రెసిడెంట్ తన ఫిర్యాదులో అభ్యర్థించారు. శనివారం బిహార్ లోని చివరి 8 లోక్సభ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఒక అసెంబ్లీ సీటుకు బైఎలక్షన్ కూడా జరిగింది.
ఓటేసిన ప్రముఖులు..
చివరి విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటేశారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, కూతురు రోహిణి ఆచార్య, కొడుకు తేజస్వీ యాదవ్ పాట్నా సిటీలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. యూపీలోని గోరఖ్ పూర్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్, పంజాబ్ లో సీఎం భగవంత్ సింగ్ మాన్ దంపతులు, చత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హిమాచల్ ప్రదేశ్ లోని మండిలో బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్, పంజాబ్ లోని మొహాలీలో ఆప్ లీడర్ రాఘవ్ చద్దా, యూపీలోని గోరఖ్ పూర్ లో బీజేపీ లీడర్ రవికిషన్, కోల్ కతాలో నటుడు మిథున్ చక్రవర్తి ఓటు వేశారు.