
- తక్కువ ధరకే దొరుకుతున్న మందులు
- గ్లోబల్ మార్కెట్లో ఇండియన్ కంపెనీల దూకుడు
న్యూఢిల్లీ: మనదేశ డయాబెటిస్ మందుల మార్కెట్లో ధరల యుద్ధం నడుస్తోంది. ఇండియా ఫార్మా కంపెనీలు భారీ ఎత్తున ఎంపాగ్లిఫోజిన్ జనరిక్ వెర్షన్లను విడుదల చేస్తున్నాయి. ఈ ట్యాబ్లెట్లను టైప్–2 డయాబెటిస్ ట్రీట్మెంట్ కోసం వాడతారు. కంపెనీలు వీటిని పోటాపోటీగా విడుదల చేస్తుండటంతో ధరలు తగ్గుతున్నాయి. ఫలితంగా కోట్లాది మంది పేషెంట్లకు తక్కువ ధరల్లో మందులు అందుబాటులోకి వస్తున్నాయి. దశాబ్దకాలంగా డయాబెటిస్ రోగులు ఎంపాగ్లిఫోజినే వాడుతున్నారు. దీనిని ఎలీ లిలీ సాయంతో బోహ్రింగర్ఇంగెలిహీమ్ డెవెలప్ చేసింది. జార్డియన్స్పేరుతో అమ్ముతోంది. చాలా మార్కెట్లలో దీని పేటెంట్గడువు ముగియడంతో భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీలు తక్కువ ధరలతో ట్యాబ్లెట్లను తీసుకొచ్చాయి. ధరలను 80 శాతం వరకు తగ్గించి గ్లోబల్ కంపెనీలకు సవాల్ విసిరాయి. జెనెరిక్స్ రావడానికి ముందు 10 ఎంజీ డోస్ జార్డియన్స్ టాబ్లెట్ ధర ఒక్కొక్కటి రూ.58– 60 వరకు ఉండేది. 25 ఎంజీ వేరియంట్కు రూ.65–రూ.70 వరకు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. మనదేశ ఫార్మా కంపెనీలు చవకగా అమ్ముతున్నాయి. మాన్కైండ్ ఫార్మా ఎంపాగ్లైడ్ ఎంపాగ్రేట్ 10 ఎంజీ ధర రూ.5.49 కాగా, 25 ఎంజీ ట్యాబ్లెట్ధర రూ.9.90 మాత్రమే. గ్లెన్మార్క్ గ్లెమ్పా టాబ్లెట్ ఒక్కొక్కటి రూ.8.50–రూ.10 మధ్య ధర పలుకుతోంది. అయితే ఆల్కెమ్ తయారు చేసిన ఎంపాన్ నార్మ్ కొన్ని మార్కెట్లలో మరింత తక్కువ ధరకు దొరకవచ్చని భావిస్తున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకారం, భారతదేశంలో 10 కోట్ల మంది డయాబెటిస్ బాధితులు ఉన్నారు.
భారతీయ ఫార్మా మార్కెట్కు ఎంతో మేలు
జనరిక్ ఎంపాగ్లిఫ్లోజిన్ను తక్కువ ధరలకు తీసుకురావడం వల్ల మనదేశ ఫార్మా కంపెనీలు గ్లోబల్ మార్కెట్లో దూసుకెళ్తున్నాయి. వీటి ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉంది. జనరిక్ వెర్షన్లు రాబోయే రెండు సంవత్సరాలలో ఎంపాగ్లిఫ్లోజిన్ మార్కెట్లో 60 శాతానికిపైగా వాటాను దక్కించుకుంటాయని అంచనా. ఇతర కంపెనీల కంటే ముందే గ్లెన్మార్క్ ఫార్మా గ్లెంపా -ఎల్ (ఎంపాగ్లిఫ్లోజిన్ + లినాగ్లిప్టిన్), గ్లెంపా- ఎం (ఎంపాగ్లిఫ్లోజిన్ + మెట్ఫార్మిన్) వంటి ఫిక్స్డ్- డోస్ కాంబినేషన్లతోపాటు 10 ఎంజీ, 25 ఎంజీ డోసుల్లో గ్లెంపా బ్రాండ్ క్రింద ఎంపాగ్లిఫ్లోజిన్ను విడుదల చేసింది. ధరల విషయంలో దూకుడుగా ఉండే మ్యాన్కైండ్ ఫార్మా... ఎంపాగ్లైడ్, ఎంపాగ్రేట్ డైనాడ్యూతో సహా అనేక ఎంపాగ్లిఫ్లోజిన్ -ఆధారిత బ్రాండ్లను ప్రవేశపెట్టింది. దీంతో బోహ్రింగర్ ఇంగెల్హీమ్, ఎలి లిలీ కంపెనీలు తమ ధరలను మార్చే విషయాన్ని పరిశీలిస్తాయని భావిస్తున్నారు. గ్లోబల్ డయాబెటిస్ మార్కెట్ సైజు 2032 నాటికి రూ.1.96 లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా.