మార్కెట్​ కమిటీలో పసుపు చోరీ లొల్లి

మార్కెట్​ కమిటీలో పసుపు చోరీ లొల్లి
  • సెక్యూరిటీ ఇన్​చార్జ్​పై హమాలీల దాడి

నిజామాబాద్, వెలుగు : నగరంలోని అగ్రికల్చర్  మార్కెట్​ కమిటీ గంజ్​లో అమ్మకానికి తెచ్చిన పసుపు కుప్పల నుంచి కొంత సరుకు చోరీ అవుతుందన్న  శనివారం వివాదాస్పదమైంది.  తామే దొంగతనం చేస్తున్నట్లు రైతులను ఉసుగొల్పుతున్నారని ఆరోపిస్తూ సెక్యూరిటీ ఇన్​చార్జ్​ శ్రీనివాస్​పై హమాలీలు దాడి చేశారు. పసుపు అమ్మకాలు ఆపేసి ఆందోళనకు దిగారు.  జిల్లాలోని పసుపు రైతులు సరుకు అమ్మడానికి గంజ్​ మార్కెట్​కు నిత్యం కనీసం 10 వేల క్వింటాళ్లు తెస్తున్నారు. తేమ శాతం ఇతర కారణాలతో అమ్మకాలు జరగడానికి మూడు, నాలుగు రోజుల టైం పడుతోంది.

రాత్రి వేళ రాశుల వద్ద రైతులు ఉండరు. దీనిని అదనుగా తీసుకొని కొంత భాగం సరుకును గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేస్తున్నట్లు రైతుల్లో అనుమానాలున్నాయి. సెక్యూరిటీ ఇన్​చార్జ్​ హమాలీలపై ఆరోపణలు చేస్తున్నాడన్న అనుమానంతో  200 మంది హమాలీలు ఆందోళనకు దిగారు.  పోలీసులు వచ్చి సెక్యూరిటీ ఇన్​చార్జ్​ను తీసుకెళ్తుండగా హమాలీలు అడ్డుకున్నారు.  మార్కెట్ కమిటీ చైర్మన్​ ముప్ప గంగారెడ్డికి ఫిర్యాదు చేయడంతోపాటు  పసుపు అమ్మకాలు మధ్యాహ్నం వరకు నిలిచిపోయాయి.