
క్లిక్ ఎన్ బుక్ అనే పేరుతో ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ లో కొత్తగా ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా కస్టమర్లు స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ లెటర్లు, పార్సెల్లను ఇంట్లో కూర్చొని బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ సేవ హైదరాబాద్లో 107 పిన్ కోడ్లలో అందుబాటులో ఉంది. పోస్టల్ డిపార్ట్మెంట్ లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించుకుని కస్టమర్ ఫ్రెండ్లీగా, హై-టెక్ సర్వీసులను అందించడానికి ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఈ సర్వీసును అందుబాటులోకి తెచ్చింది.
ముందుగా దీనిని ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్రాజ్ జిల్లాలోని ప్రయాగ్రాజ్, కచ్చరీ హెడ్ పోస్టు ఆఫీసుల్లో మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ లోకి కూడా తెచ్చారు. దీంతో కస్టమర్ పోస్టు ఆఫీస్ కు వెళ్లకుండానే గరిష్టంగా 5 కేజీల వరకు స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ లెటర్లు, పార్సెల్లను పంపించుకోవచ్చు.
ఈ సౌకర్యాన్ని పొందాలంటే కస్టమర్లు ముందుగా పోస్టల్ శాఖ వెబ్సైట్ www.indiapost.gov.in లో అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కస్టమర్లు రూ.500 వరకు బుకింగ్ ఛార్జీలు చెల్లిస్తే.. పోస్టల్ డిపార్ట్మెంట్ మీ పోస్టులను, లేదా పార్సెల్లను పూర్తి ఉచితంగా పికప్ చేసుకుంటారు. ఒక వేళ మీరు చెల్లించిన బుకింగ్ ఛార్జీలు రూ.500 కంటే తక్కువగా ఉంటే.. రూ.50 వరకు పికప్ ఛార్జీల కింద వసూలు చేస్తారు.
అదివారం, గవర్నమెంట్ సెలవుల్లో మాత్రం ఈ సేవలు అందుబాటులో ఉండవు. ప్రతి రోజు ఉదయం 9.30 గంటలలోపు మీరు బుకింగ్ చేసుకుంటే.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటలోపు పికప్ చేసుకుంటారు. ఉదయం 9.30 గంటల తరువాత బుకింగ్ చేసుకుంటే.. మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటలలోపు పికప్ చేసుకుంటారు. ఒకవేళ మీరు మధ్యాహ్నం 12.30 గంటల తరువాత బుకింగ్ చేసుకుంటే మరుసటి రోజు పికప్ చేసుకుంటారు.