
హనుమకొండ, వెలుగు : కలెక్టర్ను కలిసి డైరెక్ట్గా తమ సమస్యను చెబితే త్వరగా పరిష్కారం అవుతుందన్న ఆశతో గ్రీవెన్స్కు వస్తున్న ప్రజలకు ప్రయాసే మిగులుతోంది. గ్రీవెన్స్లో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా ఆఫీసర్లు ఆదేశిస్తున్నా కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం చూపుతున్నారు. దీంతో ప్రజలు ప్రతీవారం కలెక్టరేట్ చుట్టూ తిరగకతప్పడం లేదు. కొందరైతే అర్జీ పట్టుకొని పదుల సార్లు కలెక్టరేట్కు వస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
సగానికిపైగా పెండింగ్లోనే...
మండల స్థాయి ఆఫీసర్లు సరిగా పట్టించుకోకపోవడంతో కలెక్టరేట్ గ్రీవెన్స్కు వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రతి సోమవారం వందలాది మంది అర్జీలు పట్టుకొని కలెక్టరేట్ ఎదుట క్యూ కడుతున్నారు. ధరణి కారణంగా క్షేత్ర స్థాయిలో భూ సమస్యలు ఎక్కువ కాగా ఆ బాధితులంతా తహసీల్దార్లకు అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు. వారు స్పందించకపోవడంతో కలెక్టర్ను కలిసేందుకు గ్రీవెన్స్కు వస్తున్నారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల కారణంగా జూన్లో మూడు వారాల పాటు గ్రీవెన్స్ను రద్దు చేసిన ఆఫీసర్లు జూన్ 26 నుంచి తిరిగి స్టార్ట్ చేశారు. అయితే దశాబ్ది ఉత్సవాలకు ముందు సగటున 60 నుంచి 70 అర్జీలు అందగా ప్రస్తుతం సెంచరీ దాటిపోతున్నాయి. హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్కు జూన్ 26న రికార్డ్ స్థాయిలో 180 అర్జీలు వచ్చాయి. ఆ తర్వాత జులై 3న 118, 10న 104 అప్లికేషన్లు అందాయి. కానీ ఇందులో సగనికిపైగా అప్లికేషన్లు పెండింగ్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. సమస్య పరిష్కారం కాకపోవడంతో బాధితులు మళ్లీ మళ్లీ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. గ్రీవెన్స్లో డబుల్ ఇండ్లు, దళితబంధు, పింఛన్ల కోసం భారీ సంఖ్యలో ఆర్జీలు అందుతున్నాయి.
గ్రేటర్లోనూ ఇదే తీరు
బల్దియాకు కూడా గ్రీవెన్స్ అప్లికేషన్లు పోటెత్తుతున్నాయి. గతంలో 30 నుంచి 50 మధ్య అప్లికేషన్లు రాగా ప్రస్తుతం 70 దాటుతున్నాయి. కమిషనర్గా షేక్ రిజ్వాన్ బాషా చార్జ్ తీసుకున్నప్పటి నుంచి సుమారు 800కు పైగా అప్లికేషన్లు రాగా అందులో 390కి పైగా పెండింగ్లోనే ఉన్నట్లు సమాచారం. వరంగల్కు చెందిన ఓ యువకుడి భూమిని కొందరు కబ్జా చేసి ఇంటి నంబర్ కూడా తీసుకున్నారు. భూమిని కబ్జా చేసిన వారిపై సీపీ చర్యలు తీసుకున్నారు. ఇంటి నంబర్ రద్దు చేయాలని బాధితులు అప్లికేషన్ పెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అలాగే 65వ డివిజన్కు చెందిన ఓ వ్యక్తికి రావాల్సిన పింఛన్ మరో వ్యక్తి అకౌంట్లో పడుతున్నాయి. చర్యలు తీసుకోవాలని బాధితుడు 2 నెలల కింద అర్జీ పెట్టినా ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు.
అర్జీలను వెంటనే పరిష్కరించాలి
జనగామ అర్బన్/ములుగు/వరంగల్సిటీ, వెలుగు : ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలని జనగామ కలెక్టర్ శివలింగయ్య, ములుగు అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి, బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. సోమవారం ఆయా కలెక్టరేట్లలో నిర్వహించిన గ్రీవెన్స్లో ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. జనగామలో 69 అర్జీలు రాగా, ములుగులో 57, గ్రేటర్ వరంగల్లో 62 అప్లికేషన్లు వచ్చాయి. ఈ సందర్భంగా ఆఫీసర్లు మాట్లాడుతూ అర్జీలను వెంటవెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్లో పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నా పేరు మర్రి రాజయ్య. ఎల్కతుర్తి మండలం బావుపేట శివారులో నాకు ప్రభుత్వం 2 ఎకరాల భూమి కేటాయించింది. కొన్నేండ్ల నుంచి నేనే సాగు చేసుకుంటున్నా. ఇప్పుడు ఆ భూమిని వేరే వ్యక్తి కబ్జా చేశాడు. ధరణిలో కూడా అతడి పేరే చూపిస్తోంది. తహసీల్దార్కు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తహసీల్దార్ ఫిర్యాదు చేయడంతో నేను జైలుకు సైతం వెళ్లొచ్చిన. సమస్య పరిష్కరించాలని ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. 2018 నుంచి ఇప్పటివరకు సుమారు 20 సార్లు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసిన.
నా పేరు బోగం స్వామి. నేను పక్షవాతంతో ఇబ్బంది పడుతున్నా. పింఛన్ అప్లై చేసుకునేందుకు సదరం సర్టిఫికెట్ తీసుకుందామని మీ సేవకు వెళ్తే స్లాట్ బుక్ కావడం లేదు. నా పేరు ఇప్పటికే నమోదైనట్లు చూపిస్తుండడంతో స్లాట్ తీసుకోవడం లేదు. ఇప్పటికే మూడుసార్లు అప్లికేషన్ పెట్టుకున్న. పక్షవాతంతో నడవలేని నేను ఎన్ని సార్లని తిరగాలి.