
పాట్నా: బీహార్ సీఎం నితీష్ కుమార్పై ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం నితీష్ కుమార్ మెంటల్ అన్ఫిట్ అని.. ఆయన శారీరకంగా, మానసికంగా ఆలసిపోయారని ఆరోపించారు. కనీసం ఆయన కేబినెట్లోని మంత్రుల పేర్లు కూడా నితీష్ కుమార్ గుర్తు ఉండటం లేదని హాట్ కామెంట్స్ చేశారు. రోజురోజుకు ఆయన మానసిక ఆరోగ్యం క్షీణిస్తుండటంతో ఇకపై ఆయన పాలించడానికి తగినవారు కాదని అన్నారు. 2026 బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే నితీష్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ALSO READ | ప్రధాని మోడీ మరో విదేశీ టూర్.. ఏప్రిల్ 5న శ్రీలంక
“సీఎం నితీష్ కుమార్ శారీరకంగా అలసిపోయాడు. మానసికంగా ఆరోగ్యంగా లేడు. దీనిపై ఎవరికైనా సందేహం ఉంటే తన కేబినెట్లోని మంత్రుల పేర్లను చెప్పమని అడగండి. ఆయన చెప్పలేరు. ఇక సీఎం పదవికి ఆయన రాజీనామా చేయాలి. నితీష్కుమార్ మెంటల్ హెల్త్ కండిషన్ గురించి బీజేపీ పెద్దలకు కూడా తెలుసు” అని అన్నారు పీకే. నితీష్ కుమార్ ఆరోగ్యం గురించి మొదట ఆందోళన వ్యక్తం చేసిన వ్యక్తి ఆయన సొంత మిత్రుడు సుశీల్ కుమార్ మోడీనని గుర్తు చేశారు. తాను ఇటీవల నితీష్కుమార్ ఆరోగ్య పరిస్థితిపై మాట్లాడటం ఆపేశా.. కానీ బీపీఎస్సీ నిరసనల సమయంలో ముఖ్యమంత్రి మానసిక పరిస్థితి దిగజారిపోయిందని, రాష్ట్రంలో ఏమి జరుగుతుందో ఆయనకు కనీసం ఆయనకు తెలియదని గ్రహించానని పేర్కొన్నారు.
బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జీడీ నేత తేజస్వీ యాదవ్ సైతం ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నితీష్కుమార్ జాతీయ గీతం ప్లే అవుతున్నప్పుడు సైగలు చేస్తూ పక్కవారితో మాట్లాడారు. ఈ వీడియో షేర్ చేసిన తేజస్వీ.. దయచేసి కనీసం జాతీయ గీతాన్ని అయిన అవమానించకండని హితవు పలికారు. సీఎం నితీష్ ప్రవర్తన బీహార్ ప్రజలను పదే పదే అవమానిస్తోందని మండిపడ్డారు. కొన్ని సెకన్ల పాటు కూడా ఆయన మానసికంగా, శారీరకంగా స్థిరంగా ఉండలేకపోతున్నారు.. ఈ స్థితిలో పాలించడానికి ఆయన అర్హులా అని ప్రశ్నించారు.