- ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జనరల్ అడ్మినిస్ట్రేషన్లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు
- రాజకీయ కారణాల వల్లేనని ప్రచారం
హనుమకొండ, వెలుగు: వరంగల్ జిల్లా కలెక్టర్డా.బి.గోపిని రాష్ట్ర ప్రభుత్వం అనూహ్యంగా బదిలీ చేసింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఉన్న పి.ప్రావీణ్యను వరంగల్ కలెక్టర్గా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గోపిని హైదరాబాద్లోని జనరల్అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఆయన నుంచి సోమవారం సాయంత్రం ప్రావీణ్య కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. జీడబ్ల్యూఎంసీ కమిషనర్గా ఉన్న ప్రావీణ్యను బదిలీ చేసిన ప్రభుత్వం ఆ స్థానంలో ఎవరినీ నియమించలేదు. దీంతో మరో అధికారి వచ్చేవరకు కమిషనర్గా ఆమే కొనసాగనున్నారు.
పోస్టింగ్ ఇవ్వకుండా..
కలెక్టర్ గోపిని అనూహ్యంగా బదిలీ చేయడంపై హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో చర్చ జరుగుతోంది. సోమవారం ఉదయం గ్రీవెన్స్ తో పాటు ఆయుర్వేదిక్ శిబిరాన్ని ప్రారంభించే కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన సాయంత్రానికల్లా బదిలీ కావడం, ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జనరల్ అడ్మినిస్ట్రేషన్లో రిపోర్టింగ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నుంచి ఉత్తర్వులు వెలువడటంపై వివిధ రకాలుగా ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన కొందరు నేతల ఒత్తిడే ఇందుకు కారణమన్న చర్చ సాగుతోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన కలెక్టర్ల బదిలీల్లోనే గోపి ట్రాన్స్ఫర్ కావాల్సి ఉండగా.. అప్పుడు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే అడ్డుకున్నట్లు తెలిసింది. మహిళా దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లులో ప్రతిమ క్యాన్సర్ఇన్స్టిట్యూట్ఆధ్వర్యంలో మహిళలకు ఫ్రీ స్క్రీనింగ్క్యాంప్ నిర్వహించగా.. అక్కడ ఓ నేత ఫిర్యాదు మేరకు కలెక్టర్ పై మంత్రి కేటీఆర్ కొంత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. తర్వాత తొర్రూరులో మహిళలకు వడ్డీలేని రుణాల పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానించినా కలెక్టర్ వెళ్లకపోవడం పట్ల మంత్రి కేటీఆర్అసహనంతో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు జిల్లాలో ఇద్దరు తహసీల్దార్లపై ఫిర్యాదులు వెల్లువెత్తినా పట్టించుకోలేదని, గ్రీవెన్స్ సమస్యల పరిష్కారంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కలెక్టర్పై బదిలీ వేటు వేశారని ప్రచారం జరుగుతోంది. 2016 బ్యాచ్కు చెందిన గోపి 2021 సెప్టెంబర్ ఒకటో తేదీన వరంగల్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకోగా.. దాదాపు 18 నెలలపాటు ఇక్కడ విధులు నిర్వర్తించారు.