
వెల్దుర్తి, వెలుగు : అర్ధరాత్రి పురిటి నొప్పులతో పీహెచ్సీకి వస్తే తాళం వేసి ఉండడంతో ఓ గర్భిణి వరండాలోనే ప్రసవించింది. ఈ సంఘటన మెదక్ జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలో జరిగింది. వెల్దుర్తి గ్రామానికి చెందిన గర్భిణి తాటి సృజనకు పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో స్థానిక పీహెచ్సీకి తీసుకెళ్లారు. డ్యూటీలో వైద్యసిబ్బంది ఎవరూ లేకపోగా, దవాఖానాకు తాళం వేసి ఉంది. దీంతో చాలా సేపు ప్రసవ వేదన అనుభవించిన సృజన దవాఖాన వరండాలోనే పాపకు జన్మనిచ్చింది. ఆదివారం రాత్రి డ్యూటీలో ఉన్న నర్సు జయంతి హాస్పిటల్లో ఉండకుండా ఫ్రెండ్ ఇంట్లో నిద్రపోయినట్టు తెలిసింది. సోమవారం సాయంత్రం మూడు గంటల వరకు కూడా డాక్టర్ పీహెచ్సీకి రాలేదని బాధితురాలి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై డీఎంహెచ్వో చందునాయక్ వివరణ కోరగా వెల్దుర్తి పీహెచ్సీలో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యహరించిన నర్సు జయంతికి మెమో ఇచ్చామని తెలిపారు. ఆమెపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.