మాదాపూర్, వెలుగు: డాక్టర్ల నిర్లక్ష్యంతో ఓ నిండు గర్భిణి హాస్పిటల్ బాత్రూమ్లోనే డెలివరీ అయింది. ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోకపోవడంతో పుట్టిన కొద్దిసేపటికే శిశువు మృతిచెందాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన హైదరాబాద్ కొండాపూర్లోని ఐవీవై లీఫ్ హాస్పిటల్లో జరిగింది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం, ఏపీలోని ఈస్ట్ గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగార గ్రామానికి చెందిన సూర్య, మౌనిక ప్రేమ వివాహం చేసుకొని, హైదరాబాద్ కొండాపూర్ బెటాలియన్ సమీపంలో నివాసం ఉంటున్నారు. సూర్య ఓ కారు షోరూంలో పనిచేస్తుండగా, అతని భార్య ప్రస్తుతం ఆరు నెలల గర్భవతి. ఈ నెల 26న (సోమవారం) రాత్రి 9 గంటల సమయంలో మౌనికకు నొప్పులు రావడంతో ఆమె భర్త ఐవీవై లీఫ్ హాస్పిటల్కు తీసుకొచ్చాడు.
ఆ టైమ్లో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో, ఫోన్లో డాక్టర్ సూచనలతో నర్సులు మౌనికకు ట్రీట్మెంట్ ఇచ్చారు. కాసేపయ్యాక బాత్రూమ్కు వెళ్లిన మౌనికకు తీవ్ర రక్తస్రావమై, అక్కడే మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నర్సులకు చెప్పగా, వారు సరిగా పట్టించుకోలేదు. దీంతో కొద్దిసేపటికే బిడ్డ మృతి చెందింది. తర్వాత మంగళవారం శిశువు మృతదేహాన్ని సీఆర్ ఫౌండేషన్ శ్మశానంలో హాస్పిటల్ సిబ్బంది కుటుంబసభ్యులతో పూడ్చి వేయించారు. తమ బిడ్డ మృతికి హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 27న మాదాపూర్ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గురువారం శిశువు మృతదేహానికి పోస్టుమార్టం చేసి, తిరిగి పూడ్చివేశారు.
మా నిర్లక్ష్యం ఏమీ లేదు..
ఈ నెల 26న రాత్రి మౌనిక కడుపు నొప్పితో బాధపడుతూ మా హాస్పిటల్కు వచ్చింది. అప్పటికే ఆమెకు బ్లీడింగ్ అవుతుండడంతో డ్యూటీలో ఉన్న నర్సు ఆమెకు ప్రాథమిక చికిత్స చేసింది. ఒక్కసారిగా బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం వల్ల బాబుకు జన్మనిచ్చింది. నెలలు నిండక ముందే శిశువు పుట్టడంతో హెల్త్ బాగలేక మృతి చెందింది. ఇందులో మా నిర్లక్ష్యం ఏం లేదు.
- డాక్టర్ సుజాత దేవి, ఐవీవై లీఫ్ హాస్పిటల్