![బడ్జెట్ నుంచి ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ కావాలి : ఎనలిస్ట్ వినాయక్ మెహతా](https://static.v6velugu.com/uploads/2024/07/preparing-to-introduce-full-scale-budget-for-the-financial-year-2024-25_y7zXDASbPW.jpg)
- మిడిల్ క్లాస్పై ఆర్థిక భారం తగ్గించాలి
- 80 సీ, 80 డీ కింద డిడక్షన్ల లిమిట్ను పెంచాలి
- స్టాండర్డ్ డిడక్షనూ పెంచి ఉద్యోగులకు ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వాలి
న్యూఢిల్లీ : కొత్తగా ఏర్పడిన నరేంద్ర మోదీ ప్రభుత్వం 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశ పెట్టడానికి రెడీ అవుతోంది. ఈ బడ్జెట్లో ట్యాక్స్ సంస్కరణలు ఉంటాయనే అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా తమపై ట్యాక్స్ భారం తగ్గుతుందని మిడిల్ క్లాస్ వర్గాలు భావిస్తున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) లిమిట్ను గత పదేళ్లలో ఒక్కసారి కూడా పెంచలేదని, ప్రస్తుతం 80 సీ కింద ట్యాక్స్పేయర్లు ఎంచుకుంటున్న పాపులర్ స్కీమ్ ఇదేనని గుర్తు చేస్తున్నాయి. బడ్జెట్ నుంచి మిడిల్ క్లాస్ కోరుకుంటున్న ఐదు అంశాలను ఇన్ఫినిటీ గ్రూప్ ఫౌండర్ వినాయక్ మెహతా వివరించారు.
1. పాత ట్యాక్స్ సిస్టమ్లో రూ. 2.5 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు ఉంది. దీనిని రూ.5 లక్షలకు పెంచాలని వినాయక్ మెహతా ప్రభుత్వాన్ని కోరారు. కొత్త ట్యాక్స్ సిస్టమ్లో రూ.3 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు పెంచినా, మిడిల్ క్లాస్కు అనుకున్నంత ఊరట లభించలేదని అన్నారు. ట్యాక్స్ స్లాబ్స్లో మార్పులు చేయాలని సలహా ఇచ్చారు.
2. పాత ట్యాక్స్ సిస్టమ్లో రూ.1.5 లక్షల వరకు వివిధ డిడక్షన్లను పొందొచ్చు. ఉద్యోగులు, ఇతరులు కూడా సెక్షన్ 80 సీ కింద ఈ డిడక్షన్స్ను పొందడానికి వీలుంది. కానీ, గత పదేళ్లుగా సెక్షన్ 80 సీ కింద పొందే డిడక్షన్లు రూ.1.5 లక్షలకు పరిమితంగా ఉన్నాయి. ఈ లిమిట్ను రూ.2.5 లక్షలకు పెంచితే మిడిల్ క్లాస్కు ప్రయోజనం ఉంటుందని వినాయక్ మెహతా అభిప్రాయపడ్డారు. పెరిగిన ఇన్ఫ్లేషన్ను ఎదుర్కోవడానికి, ప్రజల సేవింగ్స్ పెంచడానికి ఇది సాయపడుతుందని అన్నారు. కాగా, కొత్త ట్యాక్స్ సిస్టమ్లో సెక్షన్ 80 సీ కింద ఎటువంటి డిడక్షన్లు ఇవ్వడం లేదు.
3. కొత్త, పాత రెండు ట్యాక్స్ సిస్టమ్స్లో కూడా రూ.50 వేలు స్టాండర్డ్ డిడక్షన్గా ఉద్యోగులు పొందొచ్చు. దీనిని రూ.లక్షకు పెంచాలని వినాయక్ మెహతా ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. స్టాండర్డ్ డిడక్షన్ పెంచితే జీతాలపై ఆధారపడి బతికే వాళ్లకు పెద్ద ఉపశమనం దక్కుతుందని అన్నారు. మెడికల్, ఇంధన ఖర్చులు పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో మిడిల్ క్లాస్కు ఇది మేలు చేస్తుందని అన్నారు.
4. ఇండ్లు కొనుక్కునేవారికి రానున్న బడ్జెట్లో ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వాలని వినాయక్ మెహతా అన్నారు. హోమ్ లోన్ల అసలు రీపేమెంట్లపై డిడక్షన్ను సెక్షన్ 80 సీ కింద కాకుండా సపరేట్గా క్లయిమ్ చేసుకోవడానికి వీలు కల్పించాలని కోరారు. ప్రస్తుతం పాత ట్యాక్స్ సిస్టమ్లో 80 సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు పొందడానికి వీలుంది. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, ట్యూషన్ ఫీజులు, ప్రావిడెంట్ ఫండ్ పెట్టుబడులు, హోమ్ లోన్ల అసలు రీపేమెంట్స్ను 80 సీ కింద మినహాయింపు పొందడానికి వీలుంది. దీని కింద హోమ్ బయ్యర్లు డిడక్షన్ పొందినా ఎక్కువ ప్రయోజనం దక్కడం లేదని వినాయక్ మెహతా అన్నారు. ఎందుకంటే ట్యాక్స్ పేయర్ 80 సీ కింద క్లయిమ్ చేసుకునే మొత్తం డిడక్షన్ల విలువ రూ.1.5 లక్షలు దాటకూడదు.
5. సెక్షన్ 80డీ కింద మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం మినహాయింపు లిమిట్ను ప్రస్తుతం ఉన్న రూ.25 వేల నుంచి రూ.50 వేలకు పెంచాలని వినాయక్ మెహతా ప్రభుత్వాన్ని కోరారు. సీనియర్ సిటిజెన్స్ కోసం అయితే రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచాలన్నారు. మెడికల్ ఖర్చులు పెరగడంతో సెక్షన్ 80 డీ కింద పొందే డిడక్షన్ లిమిట్ను పెంచితే మిడిల్ క్లాస్పై ఆర్థిక భారం తగ్గుతుందని అన్నారు.