రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రీన్ సిగ్నల్.. 52వ సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రీన్ సిగ్నల్.. 52వ సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్

న్యూఢిల్లీ: భారత 52వ ప్రధాన న్యాయమూర్తి (CJI) గా జస్టిస్ బీఆర్ గవాయ్ నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలిజియం సిఫారసులకు  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం (ఏప్రిల్ 29) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో జస్టిస్ బీఆర్ గవాయ్ నియమాకానికి లైన్ క్లియర్ అయ్యింది. 

మే 13, 2025న పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా స్థానంలో ఆయన 2025 మే 14న సీజేఐగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంగళవారం (ఏప్రిల్ 29) ఉత్తర్వులు జారీ చేసింది.

‘‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 లోని క్లాజు (2) ద్వారా ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకుని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయిని మే 14, 2025 నుండి భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తున్నందుకు రాష్ట్రపతి సంతోషంగా ఉన్నారు’’ అని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.52వ CJI గా నియమితులైన జస్టిస్ గవాయ్ 6 నెలలకు పైగా పదవీకాలంలో ఉంటారు. 2025, నవంబర్ 23 ఆయన రిటైర్ అయిపోతారు. 2010లో పదవీ విరమణ చేసిన జస్టిస్ కెజి బాలకృష్ణన్ తర్వాత షెడ్యూల్డ్ కులాల నుంచి భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికైన రెండో వ్యక్తి జస్టిస్ గవాయ్.

జస్టిస్ గవాయ్ బ్యాక్ గ్రౌండ్..:

జస్టిస్ బీఆర్ గవాయ్ మహారాష్ట్రలోని అమరావతిలో 1960, నవంబర్ 24న జన్మించారు. నాగ్ పూర్, అమరావతి మున్సిపల్ కార్పొరేషన్లు, అమరావతి విశ్వవిద్యాలయానికి స్టాండింగ్ కౌన్సెల్గా పనిచేశారు. 1992, ఆగస్టు నుంచి 1993 జులై వరకూ బాంబే హైకోర్టు నాగుర్ ధర్మాసనంలో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‎గా ఆయన సేవలందించారు. 2000, జనవరి 7న హైకోర్టు నాగ్​పూర్ ధర్మాసనంలో ప్రభుత్వ న్యాయవాదిగా, పబ్లిక్ ప్రాసిక్యూటర్​గా నియమితులయ్యారు. 2005, నవంబర్ 12న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు.

కీలక తీర్పులు 

  • 2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 4–1తో ఇచ్చిన తీర్పులో జస్టిస్ గవాయ్ ఉన్నారు.
  • 2023, డిసెంబర్లో జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఏకగ్రీవ తీర్పులో ఉన్నారు.
  • రాజకీయ పార్టీలకు సంబంధించి ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలోనూ జస్టిస్ గవాయ్ సభ్యులు.
  • ఎస్సీ వర్గీకరణలో రాష్ట్రాలకు రాజ్యాంగపరమైన అధికారం కల్పిస్తూ ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 6–1తో ఇచ్చిన తీర్పులోనూ జస్టిస్ గవాయ్ సభ్యులుగా ఉన్నారు.