
- సోషల్ మీడియాపై నియంత్రణ లేదు
- ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
వేములవాడ, వెలుగు: ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాపై సామాజిక బాధ్యత ఉంటుందని , కానీ సోషల్ మీడియాకు ఎలాంటి బాధ్యత, నియంత్రణ లేవని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రెస్ క్లబ్ కొత్త బిల్డింగ్(ఐజేయూ)ను విప్ ఆది శ్రీనివాస్, ఐజేయూ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రెస్ క్లబ్లు ప్రజల సమస్యలు వినే కేంద్రాలుగా మారాలన్నారు.
ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయిందని, సోషల్ మీడియాతో ఆ రంగం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. అదే టైంలో అవాస్తవాలు ప్రచారం కావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మీద ప్రెస్ కౌన్సిల్, అంబుడ్స్మెన్ వ్యవస్థలు ఉన్నాయన్నారు. వీటి పరిధిలో బాధ్యతగా వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రెస్క్లబ్ సభ్యులు, మీడియా ప్రతినిధులు సమాజంలో జరిగే వాస్తవాలను ప్రజలకు చేరవేయాలన్నారు.
విప్ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజంలో నైతిక విలువలు కాపాడేలా పని చేయాలని సూచించారు. తాను ఎమ్మెల్యేగా గెలవడంలో మీడియా ప్రతినిధుల పాత్ర ఉందని, దానిని తానెప్పుడూ మరిచిపోనన్నారు. అంతకుముందు వారంతా కలిసి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. కార్యక్రమంలో ప్రెస్క్లబ్అధ్యక్షుడు పుట్టపాక లక్ష్మణ్, ఐజేయూ జిల్లా అధ్యక్షుడు సంతోష్, ప్రెస్ క్లబ్ జనరల్ సెక్రటరీ మహేశ్, ఉపాధ్యక్షుడు ప్రశాంత్ పాల్గొన్నారు.