సమ్మర్​ యాక్షన్​ ప్లాన్

సమ్మర్​ యాక్షన్​ ప్లాన్
  • తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు
  • నీటి ఎద్దడి ఉన్న గ్రామాల్లో కొత్త బోర్లు
  • అప్పర్​ ప్లాట్​ గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ట్యాంకర్లు
  • వారం రోజులుగా ఫీల్డ్​ సర్వే చేస్తున్న అధికారులు

మహబూబ్​నగర్, వెలుగు:వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా మిషన్​ భగీరథ ఆఫీసర్లు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. వారం రోజుల నుంచి మహబూబ్​నగర్, నాగర్​కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో స్పెషల్​ డ్రైవ్​ నిర్వహిస్తున్నారు. మండల ఆఫీసర్లు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు గ్రామాలను సందర్శించి తాగునీటి సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు.

లీజుకు వ్యవసాయ బోర్లు..

మహబూబ్​నగర్, నారాయణపేట, నాగర్​కర్నూల్​ జిల్లాలో 80 శాతం గ్రామాలకు మిషన్​ భగీరథ ద్వారా తాగునీరు అందుతోంది. పలు మున్సిపాల్టీలతో పాటు గ్రామ పంచాయతీల్లో పైపులైన్​లు, ఇంట్రా పైపులైన్​ పనులు పూర్తి కాకపోవడంతో అక్కడ బోర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. వేసవి ప్రారంభం అవుతుండడంతో గ్రామాలు, మున్సిపల్ వార్డులు, డివిజన్లలో తాగునీటి ఇబ్బందులు రాకుండా ఈ నెల ఒకటి నుంచి పదో తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని మంత్రి సీతక్క డీపీవోలు, మిషన్​ భగీరథ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. 

దీంతో పంచాయతీ, మిషన్​ భగీరథ సిబ్బంది గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు ఉన్న ప్రాంతాలను గుర్తించేందుకు ఫీల్డ్​ విజిట్​ చేస్తున్నారు. పైపులైన్​ లీకేజీలు గుర్తించి రిపేర్లు చేయిస్తున్నారు. అలాగే అప్పర్​ ప్లాట్స్​(ఎత్తైన ప్రాంతాలు), డ్రై ఏరియాల్లో ఏటా ఇబ్బందులు వస్తుండడంతో ఆ ప్రాంతాల్లో నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ పంచాయతీ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించాలని నిర్ణయించారు. సమీపంలోని వ్యవసాయ బోర్లను లీజుకు తీసుకునేందుకు రైతులతో చర్చలు జరుపుతున్నారు.

రిపేర్లకు ఎస్డీఎఫ్​ ఫండ్స్..

నెల రోజులుగా మిషన్​ భగీరథ ఆఫీసర్లు పాత బోర్లను పరిశీలిస్తున్నారు. పూడిపోయిన వాటిని రీ డ్రిల్​ చేయిస్తున్నారు. పంచాయతీ బోర్లను వినియోగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బోరు మోటార్లు పని చేస్తున్నాయా? లేదా? అనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. పని చేయకుంటే రిపేర్లు చేయిస్తున్నారు. 

రిపేర్లకు స్పెషల్​ డెవలప్​మెంట్​ ఫండ్స్(ఎస్డీఎఫ్)​ను వినియోగిస్తున్నారు. కొన్ని చోట్ల పంచాయతీ కార్యదర్శులు సొంత డబ్బులు పెట్టి రిపేర్లు చేయించి, అనంతరం బిల్లులు తీసుకుంటున్నారు. అవసరం ఉన్న చోట్ల ఎమ్మెల్యేలు, కలెక్టర్ల పర్మిషన్లు తీసుకొని కొత్త బోర్లను డ్రిల్​ చేయిస్తున్నారు. అయితే చాలా చోట్ల నీళ్లు పడకపోవడంతో ట్యాంకర్లను అందుబాటులో ఉంచేలా ప్లాన్​ చేస్తున్నారు. 

నారాయణపూర్​ నుంచి నీటి విడుదలకు వినతి..

ఎండలు ముదురుతుండడంతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు స్పీడ్​గా అడుగంటుతోంది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని గద్వాల, వనపర్తి, మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లోని 30 లక్షల మందికి తాగునీటి ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయి. దీంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​ బాబుతో కలిసి జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు గవినోళ్ల మధుసూదన్​ రెడ్డి, వాకిటి శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్​రెడ్డి మంగళవారం కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్​ను కలిసి ఐదు టీఎంసీల నీటిని నారాయణపూర్​ ప్రాజెక్టు నుంచి జూరాలకు విడుదల చేయాలని కోరారు. స్పందించిన ఆయన నాలుగు టీఎంసీల నీటి విడుద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు అంగీకరించారు.

హ్యాండ్​ పంపులు, మోటార్లను వినియోగంలోకి తెస్తున్నాం..

మిషన్​ భగీరథ ద్వారా ప్రస్తుతం తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఐదు నుంచి పది ఇండ్లు ఉన్న ప్రాంతాలను కూడా ఒక హ్యాబిటేషన్​గా గుర్తించి తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. కొత్త బోర్లు వేయిస్తున్నా, చాలా చోట్ల ఫెయిల్​ అవుతున్నాయి. ఆ ప్రాంతాల్లో ట్యాంకర్లను అందుబాటులో ఉంచుతున్నాం. గ్రామాల్లో హ్యాండ్​ పంపులు, సింగిల్​ ఫేస్, త్రీ ఫేస్​ మోటార్లు, ఓపెన్​ వెల్స్​ను వినియోగంలోకి తెస్తున్నాం. –హెచ్.జగన్మోహన్, ఎస్ఈ, మిషన్​ భగీరథ