ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎంపీ ములాయం సింగ్ యాదవ్ అకాల మరణం పట్ల ప్రధాని మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ములాయం మరణం పట్ల ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. తాము ముఖ్యమంత్రులుగా పనిచేసిన సమయంలో అనేక సార్లు ములాయం, తాను సంభాషిచుకున్నామని ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. తమ ఇద్దరి మధ్య సన్నిహిత సహవాసం కొనసాగిందన్నారు. తాను ఎల్లప్పుడూ ఆయన అభిప్రాయాలను వినడానికి ఆసక్తి కనభర్చినట్లు చెప్పారు. ములాయం మరణం తనను బాధిస్తోందన్నారు. ఆయన కుటుంబానికి, లక్షలాది మంది మద్దతుదారులకు ప్రధాని సానుభూతి తెలిపారు. ఓం శాంతి అని ట్వీట్ చేశారు.
పేదల కోసం పోరాడారు..
ములాయం సింగ్ యాదవ్ ది అద్భుతమైన వ్యక్తిత్వం అని ప్రధాని మోడీ కొనియాడారు. పేదల లీడర్ గా ఆయన గుర్తింపు పొందారని చెప్పారు. పేద ప్రజల సమస్యలపై పోరాడారని గుర్తు చేశారు. JP లోక్నాయక్,డా. లోహియా మార్గంలో నడుస్తూ.. ప్రజలకు సేవ చేసారని తెలిపారు.
బలమైన భారత్ కోసం పనిచేశారు
యూపీ, జాతీయ రాజకీయాల్లో ములాయం సింగ్ యాదవ్ తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారని ప్రధాని మోడీ చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యంలో కీలక సైనికుడిగా పనిచేశారని గుర్తు చేశారు. రక్షణ మంత్రిగా, బలమైన భారతదేశం కోసం పనిచేశారన్నారు. రక్షణ శాఖ మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు జాతీయ ప్రయోజనాలను పెంపొందించాయన్నారు.