ఆమోదించకుంటే పోరాటమే.. బీసీలపై ప్రధాని మోదీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి: జాజుల శ్రీనివాస్​గౌడ్​

ఆమోదించకుంటే పోరాటమే.. బీసీలపై ప్రధాని మోదీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి: జాజుల శ్రీనివాస్​గౌడ్​

హైదరాబాద్​సిటీ, వెలుగు: తెలంగాణలో ఆమోదించిన 42శాతం బీసీ రిజర్వేషన్​ బిల్లులను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్​లోనూ ఆమోదించి, తొమ్మిదో షెడ్యూల్​లో చేర్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​గౌడ్ డిమాండ్​చేశారు.  పార్లమెంట్​లో బిల్లులను ఆమోదించకపోతే రైతు ఉద్యమం, తెలంగాణ ఉద్యమం మాదిరిగా బీసీ రిజర్వేషన్ల ఉద్యమం చేపట్టి అమీ తుమీ తేల్చుకుంటామని తేల్చిచెప్పారు. 

‘‘బీసీ బిల్లులను ఆమోదించడంతోపాటు త్వరలో చేపట్టబోయే జనగణనతో పాటే బీసీ కులగణన చేపట్టి ప్రధాని మోదీ బీసీల పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి” అని ఆయన డిమాండ్​ చేశారు. ఢిల్లీ జంతర్​మంతర్​ వద్ద జరిగే ‘బీసీల పోరుగర్జన’ మహాధర్నాకు సోమవారం చర్లపల్లి రైల్వే స్టేషన్​నుంచి ప్రత్యేక రైలులో పలువురు బీసీ సంఘాల నేతలు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్​గౌడ్​ జెండా ఊపి రైలును ప్రారంభించారు. 

ఆయన మాట్లాడుతూ..  42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లులను పార్లమెంటులో ఆమోదించాలన్న ప్రధాన డిమాండ్​తో ఢిల్లీలో మహాధర్నా నిర్వహిస్తున్నామన్నారు. బీసీ సంఘాలన్నీ ఒకే వేదిక మీదికి వచ్చి ధర్నా చేపడ్తుండటం చరిత్రాత్మకమని తెలిపారు.  ప్రధానమంత్రి మోదీకి నిజంగా బీసీలపై చిత్తశుద్ధి ఉంటే బీసీ బిల్లులకు పార్లమెంట్​లో ఆమోదం పొందేలా కృషి చేయాలని డిమాండ్​ చేశారు. మహాధర్నాకు అన్ని పార్టీల ప్రతినిధులు, లోక్​సభ ప్రతిపక్షనేత రాహుల్​గాంధీతో పాటు, పీసీసీ చీఫ్​మహేశ్​కుమార్​గౌడ్​, 26 రాజకీయ పార్టీలు, ఎంపీలు పాల్గొననున్నారని ఆయన వివరించారు. 

ఢిల్లీ వేదికగా బీసీల సత్తా చాటుతామన్నారు. కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్​ ప్రెసిడెంట్​కుల్కచర్ల శ్రీనివాస్​ముదిరాజ్, తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సాగర్​, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్​కె.గణేశ్​చారి, జాతీయ వడ్డెర సంఘం అధ్యక్షుడు వేముల వెంకటేశ్, అఖిల భారత విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు కవులె జగన్నాథ్​, కుర్మ సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్​, బీసీ సంఘాల లీడర్లు రావులపోలు నగేశ్​ ప్రజాపతి, విక్రమ్ గౌడ్​, సింగం నాగేశ్​, దుర్గయ్య గౌడ్​పాల్గొన్నారు.