అన్ని దేశాలు గ్లోబల్​క్రైసిస్‌లో ఉన్నప్పుడు మనం భారత్ దశాబ్ది గురించి చర్చించాం : మోదీ

అన్ని దేశాలు గ్లోబల్​క్రైసిస్‌లో ఉన్నప్పుడు మనం భారత్ దశాబ్ది గురించి చర్చించాం : మోదీ

న్యూఢిల్లీ: ప్రపంచం మొత్తం కరోనా, ఆర్థిక, నిరుద్యోగ, పర్యావరణ సమస్యలతో సతమతమవుతున్నవేళ  భారత్​ ఓ ఆశాకిరణంలా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా సమయంలో అన్ని దేశాలు ఆర్థిక అనిశ్చితితో ఇబ్బంది పడుతుంటే.. మనం మాత్రం భారత్​ దశాబ్దిపై చర్చలు జరిపామని గుర్తుచేశారు. దేశం అన్ని రంగాల్లోనూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. సోమవారం ఎన్డీటీవీ వరల్డ్ సమిట్​లో  ప్రధాని మోదీ మాట్లాడారు. మూడో టర్మ్​లో తమ సర్కారు 125 రోజులు పూర్తిచేసుకున్నదని, ఈ తక్కువ కాలంలోనే ఎన్నో అభివృద్ధి పనులు చేశామని వెల్లడించారు. పేదలకు 3 కోట్ల ఇండ్లు నిర్మించి ఇచ్చామని తెలిపారు.  రూ. 9 లక్షల కోట్లతో ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ప్రాజెక్ట్స్​ను ప్రారంభించినట్టు చెప్పారు. 

15 కొత్త వందే భారత్​ రైళ్లను ప్రారంభించామని, 8 కొత్త ఎయిర్​పోర్టుల పని ప్రారంభమైందని తెలిపారు. యువతకు రూ.2లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించామని, 70 ఏండ్లకు పైబడిన వారి కోసం రూ.5 లక్షల హెల్త్​ ఇన్సూరెన్స్ ​సౌకర్యాన్ని కల్పించామని తెలిపారు.  ‘5 లక్ష ఇండ్లల్లో రూఫ్​టాప్ సోలార్​ సిస్టమ్స్ ఏర్పాటు చేశాం. రైతుల ఖాతాల్లో రూ.21వేల కోట్లు బదిలీ చేశాం. 12 కొత్త ఇండస్ట్రియల్​ డాట్స్​ను ఆమోదించాం. స్టాక్​ మార్కెట్ సూచీల్లో దాదాపు 7% వృద్ధి రికార్డైంది. విదేశీ మారకద్రవ్యం 700 బిలియన్​  డాలర్లను దాటేసింది’ అని మోదీ వివరించారు. ఇదంతా 125 రోజుల్లోనే జరిగిందన్నారు.

ప్రపంచ భవిష్యత్తును భారత్ నిర్ణయిస్తుంది

తాము మూడోసారి అధికారంలోకి వచ్చిన 125 రోజుల్లోనే దేశంలో 3  ప్రపంచ స్థాయి సమావేశాలు జరిగాయని మోదీ పేర్కొన్నారు. టెలికామ్​ డిజిటల్​ ఫ్యూచర్​పై అంతర్జాతీయ అసెంబ్లీ జరిగిందని, గ్లోబల్​ ఫిన్​టెక్ ఫెస్టివల్, గ్లోబల్ సెమీ కండక్టర్ ఎకో సిస్టమ్​పై సదస్సు నిర్వహించినట్టు చెప్పారు. ఈ కాలంలోనే రేటింగ్​ ఏజెన్సీలు భారత వృద్ధిరేటును గణనీయంగా పెంచాయని చెప్పారు. భారత్​లో యువశక్తి అధికంగా ఉందన్నారు. దేశంలోని ప్రతి ఒక్కరూ భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నారని, 2047లో దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని అందరి మదిలో నాటుకుపోయిందన్నారు. మరో 25 ఏండ్లలో ప్రపంచ భవిష్యత్తును భారత్​ నిర్ణయిస్తుందని తెలిపారు.

ఆ శక్తి భారత్​కు ఉంది: డేవిడ్​ కామెరూన్​

రష్యా– ఉక్రెయిన్​ యుద్ధంపై మధ్యవర్తిత్వం చేయగల శక్తి భారత్​కు ఉందని బ్రిటన్​ మాజీ ప్రధాని డేవిడ్​ కామెరూన్​ అభిప్రాయపడ్డారు. యుద్ధాన్ని  ఆపడంలో భారత్​ కీలక పాత్ర పోషించగలదని చెప్పారు. ఎన్డీటీవీ వరల్డ్ ​సమిట్​లో ఆయన​ మాట్లాడుతూ ఉక్రెయిన్​ భూభాగాలను రష్యా ఆక్రమించుకోకుండా చూడాలన్నారు.

ఏఐ అంటే ఆస్పిరేషనల్ ఇండియా

ఇది ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​(ఏఐ) యుగమని, ప్రపంచ భవిష్యత్తు అంతా దీనితోనూ ముడిపడి ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు. ఏఐ అంటే మిగతా ప్రపంచానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​మాత్రమేనని, కానీ భారత్​కు మాత్రం ‘ఆస్పిరేషన్ ఇండియా’ కూడా అని పేర్కొన్నారు. ఈ ఏడాది భారత్​ ఏఐ మిషన్​ను ప్రారంభించిందని చెప్పారు. ప్రతి రంగంలో ఏఐ వినియోగాన్ని పెంచామని తెలిపారు.  అందరి ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకొనే తాము నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. 

కరోనా​ టైంలో మందులు అమ్మి మిలియన్​ డాలర్లు సంపాదించే అవకాశమున్నా అలా చేయలేదని, అది ఇండియన్​ కల్చర్​ కాదని అన్నారు. భారత్​ ఎదుగుతుంటే ప్రపంచం అసూయ చెందడం లేదని, ఎందుకంటే దేశ ఎదుగుదల ప్రపంచానికి ప్రయోజనకరంగా మారుతున్నదని తెలిపారు. డిజిటల్ ఇన్నోవేషన్​, ప్రజాస్వామ్యం కలగలసి ఎలా ఉంటుందో భారత్​ ప్రపంచానికి చూపించిందని అన్నారు. 21వ శతాబ్దంలో స్థిరత్వం,  వృద్ధి అనేది ముఖ్యమైనవని,  ఈ టర్మ్​లో తమ సర్కారు వాటిపైనే దృష్టిపెట్టిందని చెప్పారు. హర్యానాలో హ్యాట్రిక్​ విజయాన్ని అందించి తమ సర్కారు స్థిరత్వంపై నమ్మకం ఉన్నదని అక్కడి ప్రజలు నిరూపించారని చెప్పారు.

బ్రిక్స్​లో జిన్​పింగ్​తో మోదీ భేటీ ఉంటుందా?

రష్యాలోని కజన్​లో జరిగే బ్రిక్స్​ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ అక్కడికి వెళ్లారు. ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో  వీరిమధ్య భేటీ ఉంటుందా?  అనే ప్రశ్నలను మీడియా లేవనెత్తగా చైనా సూటిగా జవాబివ్వలేదు. దీనికి సంబంధించి ఏ సమాచారం ఉన్నా తాము పోస్ట్​ చేస్తామ ని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్​ జైన్​ తెలిపారు.