
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు
న్యూఢిల్లీ: స్విట్జర్ల్యాండ్ లోని దావోస్లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడనున్నారు. సమ్మిట్ మొదటి రోజు ఈ నెల 17న మోడీ ప్రసంగిస్తారని పీఎంవో శుక్రవారం తెలిపింది. వారం రోజుల పాటు వర్చువల్ మోడ్లో జరిగే ఈ సమ్మిట్లో మోడీతో పాటు ఆస్ట్రేలియా, జపాన్, ఇజ్రాయెల్ ప్రధానులు, తదితర దేశాల అధ్యక్షులు, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ పాల్గొంటారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు, పరిష్కారాలపై ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. వ్యాక్సిన్ తయారీ, కరోనా కట్టడిపైనా డిస్కస్ చేయనున్నారు.
ఇయ్యాల స్టార్టప్లతో పీఎం భేటీ
మన దేశంలోని పలు రంగాలకు చెందిన 150కి పైగా స్టార్టప్ ప్రతినిధులతో మోడీ శనివారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడనున్నారు. వ్యవసాయం, ఆరోగ్యంతో పాటు పర్యావరణం, ఎంటర్ప్రైజెస్ సిస్టమ్, స్పేస్, ఇండస్ట్రీ 4.0, సెక్యూరిటీ, ఫిన్టెక్ వంటి వివిధ రంగాలకు చెందిన స్టార్టప్లు కాన్ఫరెన్స్లో పాల్గొంటాయని పీఎం ఆఫీస్ శుక్రవారం తెలిపింది. స్టార్టప్ల కొత్త ఆవిష్కరణలు దేశ అవసరాలకు ఎలా ఉపయోగపడతాయో అర్థం చేసుకునేందుకే ఈ భేటీ అని పేర్కొంది.