లావోస్ పర్యటనలో ప్రధాని మోదీ..

లావోస్ పర్యటనలో ప్రధాని మోదీ..
  • ఆసియాన్–దేశాల అధినేతలతో ప్రధాని సమావేశం 

వియంటియాన్ (లావోస్): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లావోస్ కు చేరుకున్నారు. రెండు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా గురువారం ఢిల్లీ నుంచి ఆయన బయల్దేరి వెళ్లారు. 21వ ఆసియాన్ – ఇండియా, 19వ ఈస్ట్ ఆసియా సమ్మిట్​లో భాగంగా ఆయన ఆసియాన్ దేశాల అధినేతలతో సమావేశమయ్యారు. పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ లావోస్‌‌ (లావో పీడీఆర్) ప్రధాని సోనెక్సా సిఫనాడోన్ ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లినట్లు పీఎంవో తెలిపింది. 

వియంటియాన్ ఎయిర్​పోర్టులో దిగిన మోదీకి.. ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి విలయ్వాంగ్ బౌద్ధఖం ఘన స్వాగతం పలికారు. మోదీకి సెరిమోనియల్ గార్డ్ ఆఫ్ హానర్ లభించింది. ఎయిర్​పోర్టు నుంచి నేరుగా ఆయన డబుల్ ట్రీ హోటల్​కు వెళ్లారు. అక్కడ ప్రవాసభారతీయులు ఆయనకు గ్రాండ్ వెల్​కం చెప్పారు. చిన్నారులను మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఆటోగ్రాఫ్​లు ఇచ్చారు. వాళ్లతో సెల్ఫీలు దిగారు. 

తర్వాత అక్కడి యువకులతో కలిసి ప్రధాని మోదీ గాయత్రీ మంత్రం సహా వివిధ శ్లోకాలను పఠించారు. అనంతరం లావోస్‌‌ సంస్కృతి, వారసత్వ కట్టడాలు, ప్రాచీన కళల వివరాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌‌ను ప్రధాని తిలకించారు. రాయల్ థియేటర్​లో  ‘లావో రామాయణం’ ప్రదర్శనను వీక్షించారు.