హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ ప్రైవేటు కాలేజీలకు పెండింగ్ ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు డిగ్రీ అండ్ పీజీ కాలేజీల మేనేజ్మెంట్ల సంఘం ఆందోళనకు దిగింది. శనివారం ఇందిరా పార్కు ధర్నాచౌక్ లో ర్యాలీ కార్యక్రమం చేపట్టింది. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపేందుకు వెళ్లేందుకు మేనేజ్మెంట్ ప్రతినిధులు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.
చివరికి పోలీసులే వారిని విగ్రహం వద్దకు తీసుకువెళ్లగా.. అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు.టీపీడీఎంఏ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణరెడ్డి, యాద రామకృష్ణ మాట్లాడుతూ... 16 నెలలుగా ప్రభుత్వం కాలేజీలకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకపోవడంతో కాలేజీలను నడపడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బందికి జీతాలూ ఇవ్వలేకపోతున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే ఫీజు బకాయిలు రిలీజ్ చేయాలని కోరారు.