మనీ ల్యాండరింగ్​ లో ఇరుక్కున్నారని రూ.43.4 లక్షలు దోపిడి

మనీ ల్యాండరింగ్​ లో ఇరుక్కున్నారని రూ.43.4 లక్షలు దోపిడి

బషీర్ బాగ్, వెలుగు: మనీల్యాండరింగ్​ కేసులో చిక్కుకున్నారని, సుప్రీం కోర్టు ఈ కేసులో మరణ శిక్ష విధించే అవకాశం ఉందని బెదిరించి ఓ ప్రైవేటు ఉద్యోగం చేసున్న మహిళ నుంచి రూ. 43.4 లక్షల డబ్బు లాగిన ఘటనలో సైబర్​ పోలీసులు కేసు నమోదు చేశారు. నగరానికి చెందిన 36 ఏళ్ల మహిళా ప్రైవేట్ ఉద్యోగికి కొన్ని రోజుల క్రితం సైబర్​ నేరగాళ్లు ఫోన్​ చేశారు. ఇల్లీగల్​ యాడ్స్​, వేధింపుల మెసేజ్​లు పంపుతున్నారని ముంబైలో కేసు నమోదు అయిందని చెప్పారు. 

ట్రాయ్‌ ఆమె నంబర్‌ను బ్లాక్ చేయకుండా ఉండాలన్నా, కేసు నుంచి బయటపడాలన్నా తాము చెప్పినట్టు చేయాలన్నారు. ఆమెను భయపట్టేందుకు ఫేక్​ ఎఫ్​ఐఆర్లు, అరెస్ట్​ వారెంట్లు పంపారు. దీంతో పాటు మనీల్యాండరింగ్​ కేసు కూడా నమోదైందని, సుప్రీంకోర్టు, ఆర్‌బీఐ లేఖలు అని చూపించారు. మరణశిక్ష విధించే అవకాశం ఉందని భయపెట్టారు. ఈ కేసు నుంచి భయటపడాలంటే ఆర్‌బీఐకి డబ్బులు ఇవ్వాలని, ఫేక్​ కోర్టు లింక్​ పంపి బాధితురాలని నమ్మించారు. ఇలా వరుసగా ఆమెను బెదిరించసాగారు. దీంతో ఆమె తాను దాచుకున్న ఎఫ్​డీ డబ్బులను కూడా డ్రా చేసి సుమారు రూ.43,40,000 స్కామర్లకు పంపింది. చివరికి మోసపోయానని గ్రహించి, హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపారు.