డేంజర్యాష్ ​ట్రావెల్స్.. ప్రైవేట్ ​ట్రావెల్స్​ కింద పడి నలిగిపోతున్న ప్రాణాలు

డేంజర్యాష్ ​ట్రావెల్స్..   ప్రైవేట్ ​ట్రావెల్స్​ కింద పడి నలిగిపోతున్న ప్రాణాలు
  • యాక్సిడెంట్లతో భయాందోళనలో జనం
  • బషీర్​బాగ్​లో దంపతులను ఢీకొన్న బస్సు, ఒకరు మృతి 
  • వార్తలు వచ్చినప్పుడే ఆర్టీఏ, పోలీసుల యాక్షన్

హైదరాబాద్​సిటీ, వెలుగు:
మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్​తో మహానగరంలో ప్రైవేట్​ట్రావెల్ ​బస్సులు జనాల ఉసురు తీస్తున్నాయి. తాజాగా బషీర్​బాగ్​లో సోమవారం ఆరెంజ్​ ట్రావెల్స్​ బస్సు రాంగ్ రూట్​లో దూసుకొచ్చి ఢీ కొట్టడంతో టూ వీలర్​పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ భర్త చనిపోగా, భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.  నగరంలో ఇలాంటి ప్రమాదాలు ఇప్పుడు సర్వ సాధారణమైపోయాయి. 

సిటీలో ఆర్టీసీ బస్సులతో సమానంగా ట్రావెల్స్​ బస్సులు రోడ్లపై తిరుగుతూ ట్రాఫిక్​ సమస్యను సృష్టిస్తున్నాయి. నిజానికి బయటి ప్రాంతాల నుంచి వచ్చే ప్రైవేట్​ ట్రావెల్స్​ బస్సులు ఉదయం 7గంటల్లోపే నగరంలోకి ప్రవేశించాలి. అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులు రాత్రి 10గంటల తర్వాతే రోడ్డెక్కాలి. ప్రైవేట్​ ట్రావెల్స్ ​ఓనర్లు, డ్రైవర్లు ఈ రూల్స్​పాటించినట్టు ఎక్కడా కనిపించదు. ట్రాఫిక్​ పోలీసులు గానీ, ఆర్టీఏ ఆఫీసర్లు కానీ, చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా అరుదే. పత్రికల్లో వార్తలు పబ్లిష్​ అయినప్పుడు రెండు మూడు బస్సుల్లో తనిఖీలు చేయడం, సీజ్​ చేయడం కామన్ ​అయిపోయింది.  

ఓవర్ ​స్పీడే ప్రధాన కారణం..

రాను రాను ప్రైవేట్​ట్రావెల్స్​వల్ల జరిగే ప్రమాదాలు పెరుగుతున్నాయి. దీనికి ట్రావెల్స్​మధ్య పోటీతత్వంతో త్వరగా చేరుకోవాలని ఓవర్​స్పీడ్​తో వెళ్లడం ఒక కారణమైతే, ర్యాష్​ డ్రైవింగ్, ఓవర్​టైం డ్యూటీలు, బస్సులు, డ్రైవర్లు ఫిట్​గా లేకపోవడం​ఇతర కారణాలు. తెల్లవారుజామున, రాత్రి వేళల్లో బస్సుల స్పీడ్​, హారన్​ మోతలతో సిటీ దద్దరిల్లుతూనే ఉంటుంది. కొన్ని బస్సులైతే వెనకే వచ్చి బ్రేక్​ కొట్టేంతవరకు కూడా బస్సు వచ్చినట్టు తెలియదు. బస్సుల ఫిట్​నెస్​తో పాటు బస్సును నడిపే డ్రైవర్లు కూడా ఫిట్​గా ఉండాలని ఆర్టీఏ రూల్స్​చెప్తున్నాయి. 60 ఏండ్లు పైబడిన వారు బస్సులు నడపరాదన్న నిబంధన ఉన్నా కొందరు ట్రావెల్స్​యజమానులు ఎక్స్​పీరియన్సుడ్​డ్రైవర్స్​అంటూ వారిని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 

అలాగే డ్రైవర్లు షిప్టుల వారీగా డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు రాత్రి ప్రయాణం చేసే బస్సులో తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలన్న రూల్​ను చాలా తక్కువ ట్రావెల్స్​పాటిస్తున్నాయి. రాత్రి బయలుదేరుతున్న చాలా బస్సుల్లో వెళ్లేప్పడు ఉన్న డ్రైవరే.. తిరిగి వచ్చేప్పుడు కూడా డ్రైవింగ్​చేసుకుంటూ వస్తున్నాడు. ట్రావెల్స్​ఓనర్లు చెప్పిన టైంకు డెస్టినేషన్​కు చేరుకోవాలని బస్సులను ఓవర్​ స్పీడ్​తో నడుపుతున్నారు. డ్రైవర్లు అలసిపోయినా, ఆకలేసినా టైంకు రావాల్సిందేనన్న కండీషన్లు పెడుతున్నారు. ఇదే ప్రమాదాలకు కారణమవుతోంది. ఈ విషయంలో పోలీసులు, ఆర్టీఏ అధికారులు మరింత కఠినంగా వ్యవహరిస్తే తప్ప ప్రమాదాలు తగ్గే అవకాశం కనిపించడం లేదు.  

రాంగ్ రూట్​లో దూసుకొచ్చిన బస్సు

బషీర్ బాగ్, వెలుగు: రాంగ్​రూట్​లో వచ్చిన ప్రైవేటు ట్రావెల్​బస్సును బైక్​ ఢీకొని ఒకరు మృతి చెందగా, అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. లాలాగూడకు చెందిన సంతా జసంత అబిడ్స్ చాపెల్ రోడ్ లోని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ హైస్కూల్లో టీచర్​గా పనిచేస్తున్నది. సోమవారం ఉదయం స్కూల్ వద్ద వదిలేందుకు ఆమెను భర్త ఆడోమ్ క్యారమ్ (67) బైక్​పై తీసుకొని బషీర్ బాగ్ చౌరస్తా మీదుగా బయలుదేరాడు. మార్గమధ్యలో ఎల్బీ స్టేడియం వద్ద ఆరెంజ్ ట్రావెల్స్​కు చెందిన బస్సు అతివేగంగా రాంగ్ రూట్​లో వచ్చి వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడగా, సమీప ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆడోమ్ క్యారమ్​ మృతి చెందగా, అతని భార్య తీవ్ర గాయాలతో చికిత్స పొందుతుంది. జసంత కొడుకు క్రిస్టోపర్ క్యారమ్ ఇచ్చిన ఫిర్యాదుతో డ్రైవర్ పై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి, బస్సును సీజ్ చేశారు.

గతేడాది జరిగిన ప్రమాదాలు ఇవీ....

    అక్టోబరు 30న  జీడిమెట్లలోని షాపూర్​ చౌరస్తాలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని ట్రావెల్స్​ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ప్రమాదానికి ఓవర్ ​స్పీడే కారణమైంది.  
    నవంబరు 9న బళ్లారి నుంచి హైదరాబాద్‌‌ వస్తున్న గో టూర్ ట్రావెల్స్‌‌‌‌‌‌ బస్సు ఓవర్​స్పీడ్​తో ఈఎస్‌‌ఐ మెట్రో స్టేషన్ ​వద్ద అదుపుతప్పి కారును ఢీకొట్టింది. అదే వేగంతో కారును ఈడ్చుకుంటూ వెళ్లింది. కారు డ్రైవర్ కారులో నుంచి దూకడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. 
    డిసెంబర్​20న పంజాగుట్టలో టూవీలర్​పై వెళ్తున్న ఇద్దరు బీటెక్​ స్టూడెంట్స్​ను ప్రైవేట్​ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో కాలేజీకి వెళ్తున్న పై లోకేష్ (20) అక్కడికక్కడే చనిపోగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. 
     జూన్ 10న రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​ఆరాంఘర్ చౌరస్తాలో ప్రైవేట్​ట్రావెల్స్​బస్సు ముందు వెళ్తున్న బైక్​ను ఢీకొట్టడంతో బైక్​పై ఉన్న వ్యక్తి బస్సు టైర్ల కింద పడి చనిపోయాడు. 
     మే 26న రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​ ఔటర్​ఎగ్జిట్​ నంబర్​17 దగ్గర ఓవర్​స్పీడ్​తో ఉన్న ప్రైవేట్​ట్రావెల్స్​బస్సు టైర్​ పేలడంతో బోల్తా పడింది. ముందు వెళ్తున్న ఇటుకల వాహనాన్ని తప్పించబోయి కారును తాకుతూ డివైడర్​ను ఢీకొట్టింది. ప్రమాదసమయంలో 30 మంది బస్సులో ఉండగా, ఇందులో కొంతమంది గాయపడ్డారు.