
తెలంగాణ ప్రజల ఆశలు, ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు ప్రియాంక గాంధీ. ములుగులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలోఆమె మాట్లాడారు. సోనియా గాంధీ దూరదృష్టితో ఎలాంటి రాజకీయ లబ్ధి లేకుండా తెలంగాణ ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ప్రజల ఆకాంక్షలకే విలువ ఇచ్చిందన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ రోడ్ మ్యాప్ వేసిందని తెలిపారు.
తెలంగాణలో 40వేలకు పైగా నిరుద్యోగులు ఉన్నారని చెప్పారు ప్రియాంక. అధికారంలోకి రాగానే అన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు రైతులకు రెండు లక్షల రూపాయల రూణమాఫీ చేస్తామని తెలిపారు. పంటలకు కనీస మద్దతు ధర పెంచుతామని చెప్పారు. ప్రతి ఎకారకు ఏడాది రూ.15 వేలు ఇస్తామని, భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని తెలిపారు. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని, మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలతో ముందుకు వస్తుందని అధికారంలోకి రాగనే వాటిని అమలు చేస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అధికారంలోకి రాగానే హామీలను కాంగ్రెస్ అమలు చేసిందని తెలిపారు.