- తొలి రోజు బెంగళూరుతో టైటాన్స్, ముంబాతో దబాంగ్ ఢిల్లీ ఢీ
- రా.8 నుంచి స్టార్స్పోర్ట్స్లో లైవ్
హైదరాబాద్, వెలుగు : గ్రామీణ క్రీడకు కార్పొరేట్ హంగులు అద్ది అభిమానులకు మజాను అందిస్తూ.. ఆటగాళ్లను స్టార్లుగా మార్చిన ప్రొ కబడ్డీ లీగ్ రెండో దశాబ్దంలోకి అడుగు పెడుతోంది. పది ఎడిషన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న పీకేఎల్ 11వ సీజన్తో ఫ్యాన్స్ను అలరించేందుకు సిద్ధమైంది. మెగా లీగ్ కొత్త ఎడిషన్ హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం మొదలవనుంది. పవన్ సెహ్రావత్ కెప్టెన్సీలోని తెలుగు టైటాన్స్, పర్దీప్ నర్వాల్ నాయకత్వంలోని బెంగళూరు బుల్స్ మధ్య తొలి మ్యాచ్తో కబడ్డీ కూతకు తెరలేవనుంది.
రెండో మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ కేసీ, యు ముంబా జట్లు తలపడనున్నాయి. ఈసారి హైదరాబాద్, నోయిడా, పుణె మూడు నగరాల్లోనే పోటీలు జరగనున్నాయి. 12 జట్లు బరిలో నిలిచిన లీగ్లో నవంబర్ 9వ తేదీ వరకు హైదరాబాద్ అంచె పోటీలు జరుగుతాయి. మెగా లీగ్ను భవిష్యత్తులో విదేశాల్లో నిర్వహించే ఆలోచన చేస్తున్నామని గురువారం హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న 12 జట్ల కెప్టెన్లు ట్రోఫీతో పోజిచ్చారు.
కొత్త టైటాన్స్ను చూస్తారు : కెప్టెన్ పవన్
గత మూడు సీజన్లలో చివరి స్థానంలో నిలిచిన తెలుగు టైటాన్స్ ఈసారి బాగా ఆడుతుందని కెప్టెన్ పవన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. నూతన కోచ్గా క్రిషన్ కుమార్ హుడా రావడంతో జట్టులో ఉత్సాహం వచ్చిందన్నాడు. ఈ సీజన్లో కొత్త టైటాన్స్ను చూస్తారని హామీ ఇచ్చాడు.