
- దరఖాస్తు చేసుకోని ఇన్చార్జి కమిషనర్
- నెల రోజులుగా నిలిచిన సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ
భైంసా, వెలుగు: నిర్మల్జిల్లా భైంసా మున్సిపాలిటీలో డిజిటల్ ‘కీ’ కష్టాలు నెల రోజులుగా వెంటాడుతున్నాయి. ఈ ‘కీ’ లేకపోవడంతో సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. ఇక్కడి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్రావు గత నెల 22న లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత ఇన్చార్జి కమిషనర్గా డీఈ సీహెచ్ సుదర్శన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆయన డిజిటల్ కీ కోసం దరఖాస్తు చేసుకోకపోవడంతో ఎక్కడికక్కడ పనులు పెండింగ్లో ఉన్నాయి.
బాధ్యతలపై అనాసక్తి..!
డైరెక్టర్ఆఫ్ మున్సిపల్అడ్మినిస్ట్రేటివ్ఉత్తర్వుల మేరకు ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన సుదర్శన్ రెడ్డి.. డిజిటల్‘కీ’ కోసం దరఖాస్తు చేసుకునేందుకు విముఖత చూపినట్లు తెలిసింది. ఈ బాధ్యతలను సైతం నిర్వహించేందుకు అనాసక్తితో ఉన్నట్లు సమాచారం. అయితే, మూడ్రోజుల క్రితం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. ఆధార్, పాన్ కార్డులో అక్షర దోషాలు ఉండడంతో తిరస్కరణకు గురైనట్లు చెబుతున్నారు. ఈ అక్షర దోష సవరణ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో 15 రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
తప్పని ఇబ్బందులు..
నెల రోజులుగా డిజిటల్‘కీ’ లేని కారణంగా మున్సిపల్ఆఫీస్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇతర పత్రాలు, మ్యూటేషన్ ప్రక్రియ జారీ పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటళ్లలో రోజుకు కనీసం 15 మందికి పైగా శిశువులు జన్మిస్తారు. వీరందరి కుటుంబ సభ్యులు ఆన్లైన్లో బర్త్ సర్టిఫికెట్లు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ప్రతి రోజు సర్టిఫికెట్ల కోసం దరఖాస్తుదారులు ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వీటితో పాటు ట్రేడ్ లైసెన్స్ల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యాపారులు సైతం మున్సిపల్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రెగ్యులర్ కమిషనర్తో పాటు డిజిటల్‘కీ’ అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.