
హైదరాబాద్, వెలుగు: జవహర్లాల్ నెహ్రూ టెక్నొలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) వైస్ చాన్స్లర్ (వీసీ)గా ప్రొఫెసర్ టి.కిషన్ కుమార్ రెడ్డి (టీకేకే రెడ్డి) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు వర్సిటీ రెక్టార్ విజయకుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ కె.వెంకటేశ్వర్ రావు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వర్సిటీ డెవలప్మెంట్ కోసం, విద్యా ప్రమాణాలు పెంపు కోసం కృషి చేస్తానని చెప్పారు. కాగా, వర్సిటీ సెర్చ్ కమిటీ ప్రతిపాదించిన మూడు పేర్లలో టీకేకే రెడ్డి పేరును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు.
దీంతో కొత్త వీసీ పేరును ప్రకటిస్తూ విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా ఉత్తర్వులిచ్చారు. మూడేండ్లు ఆయన ఈ పదవీలో ఉంటారని జీవోలో పేర్కొన్నారు. ఐదు రోజుల క్రితమే జీవో రిలీజ్ అయినా.. ఆలస్యంగా బయటకు వచ్చింది. కాగా, టీకేకే రెడ్డి మెకానికల్ ఇంజినీరింగ్లో సీనియర్ ప్రొఫెసర్గా ఉన్నారు. జేఎన్టీయూలో ప్రొఫెసర్గా, రెక్టార్గా పనిచేశారు. గుజరాత్లోని పండిట్ దీన్దయాళ్ పెట్రోలియం యూనివర్సిటీకి డైరెక్టర్ జనరల్గా ఆయన పనిచేశారు. ఒడిశాలోని గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నో వర్సిటీకి వీసీగా బాధ్యతలు నిర్వహించారు. ఏఐసీటీఈ అడ్వైజర్గా కూడా పనిచేశారు.