
కేయూ క్యాంపస్, వెలుగు: సంకీర్ణ ప్రభుత్వాలతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమవుతుందని హెచ్ సీయూ రిటైర్డ్ ప్రొఫెసర్ జి.హరగోపాల్ పేర్కొన్నారు. దేశంలోని విభిన్న జాతులు, కులాలు, మతాలు, బహుళ సంస్కృతి, సంప్రదాయాల ప్రజల హక్కులకు రక్షణ ఉంటుందని తెలిపారు. కేయూ సెనెట్హాల్ లో శుక్రవారం రాజనీతిశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ భారత సమాజంలో సంకీర్ణ ప్రభుత్వాలు – -ప్రజాస్వామ్యం’ అంశంపై రాజనీతిశాస్త్ర హెచ్వోడీ సంకినేని వెంకటయ్య అధ్యక్షతన జాతీయ సెమినార్ జరిగింది.
చీఫ్గెస్ట్గా పాల్గొన్న హరగోపాల్ మాట్లాడుతూ.. ప్రజల జీవితాల్లో మెరుగైన మార్పులు తెచ్చి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడమే రాజకీయ పార్టీల ప్రధానకర్తవ్యంగా ఉండాలన్నారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు కార్పొరేట్ శక్తుల ధన ప్రలోభాలకు లొంగి, ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయని, తద్వారా ప్రజాస్వామ్య ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందన్నారు.
గుల్బర్గా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ జి.శ్రీరాములు మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణమైన పాలన అందిస్తేనే ప్రాంతీయ, సంకీర్ణ ప్రభుత్వాలకు మనుగడ ఉంటుందన్నారు. కార్యక్రమంలో కేయూ రిజిస్ట్రార్ ప్రొ.వి.రామచంద్రం, కేయూ ప్రిన్సిపల్ ప్రొ.టి.మనోహర్, ముంబై యూనివర్సిటీ ప్రొఫెసర్ జోష్ జార్జ్, కేయూ రాజనీతిశాస్త్ర బీవోఎస్జి.కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.