
హనుమకొండ, వెలుగు : కాకతీయ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్లో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్తాటికొండ రమేశ్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ రిజిస్ట్రార్ పెండ్లి అశోక్బాబు పలువురిని బదిలీ చేస్తూ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్ని రోజులు రిజిస్ట్రార్గా కొనసాగిన రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీనివాసరావును ఆ బాధ్యతల నుంచి తొలగించారు. కొత్త రిజిస్ట్రార్గా ఎగ్జామినేషన్స్ కంట్రోలర్గా పనిచేసిన ప్రొఫెసర్ మల్లారెడ్డిని నియమించారు. ఎస్డీఎల్సీఈ డైరెక్టర్ స్థానంలోనూ శ్రీనివాసరావే కొనసాగగా..ఇప్పుడు దూరవిద్యా కేంద్ర సంచాలకుడిగా ప్రొఫెసర్ వి.రామచంద్రం నియమితులయ్యారు.
యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ కో ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్గా ఉన్న మల్లారెడ్డి రిజిస్ట్రార్గా బదిలీకాగా.. ఆ స్థానంలో ప్రొఫెసర్ ఎం.సదానందానికి బాధ్యతలు ఇచ్చారు. ఎగ్జామినేషన్స్ కంట్రోలర్గా కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ ఎస్.నరసింహాచారి, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీ ప్రిన్సిపాల్ గా ఆచార్య పి. అమరవేణి నియమితులయ్యారు. సుబేదారిలోని యూనివర్సిటీ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ గా ప్రొఫెసర్ పి.వరలక్ష్మి, విశ్వవిద్యాలయ వ్యాయామ కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ ఏటీబీటీ ప్రసాద్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కొత్తగా నియామకమైన అధికారులకు బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు.