
హైదరాబాద్, వెలుగు: ఐసీఐసీఐ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ పేరుతో సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. తాము సూచించిన ట్రేడింగ్స్లో ఇన్వెస్ట్మెంట్లు పెడితే..100 శాతం నుంచి 300 శాతం వరకు లాభాలు వస్తాయని ట్రాప్ చేసి రూ.కోట్లు కొట్టేశారు. వివరాల్లోకి వెళ్తే.. కుత్బుల్లాపూర్ చింతల్కు చెందిన వివివై కుమార్ రెడ్డి అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు.
గత నెల 18న ఐసీఐసీఐ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ పేరుతో అతనికి వినిత పటోడియా పేరుతో వాట్సాప్ మెసేజ్ వచ్చింది. తమ వద్ద బ్లాక్ ట్రేడింగ్ చేస్తే 100 నుంచి 300 శాతం లాభాలు వస్తాయని నమ్మించారు. ఇందులో ఐ ఫోన్కు ట్రేడింగ్ లింక్స్ పంపించారు. సైబర్ నేరగాళ్లు సూచించిన విధంగా గత నెల 21న వివి రెడ్డి రూ.5 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. ఇలా విడతల వారిగా 14 అకౌంట్లకు 42 ట్రాన్సాక్షన్ల ద్వారా మొత్తం రూ.4,76,50,000 డిపాజిట్ చేశాడు.
నిందితుల జాబితాలో 9 కంపెనీల పేర్లు
ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు ఈ నెల 24 వరకు రూ.49.80 కోట్లు లాభాలు వచ్చినట్లు చూపారు. దీంతో బ్లాక్ ట్రేడింగ్లో పొందిన లాభాల్లో రూ.కోటి విత్డ్రా చేసుకునేందుకు వివివై రెడ్డి యత్నించగా, సాధ్యపడలేదు.15 శాతం ట్యాక్స్లు చెల్లిస్తేనే డబ్బులు డ్రా చేసుకునే వీలుంటుందని నమ్మించారు. దీంతో తాను మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు మంగళవారం సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసిన టీజీసీఎస్బీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు అశ్విన్ పరేఖ్, వినిత పరేఖ్, వినిత పటోడియా సహా బ్యాంక్ అకౌంట్స్ కలిగి ఉన్న 9 కంపెనీలను నిందితుల జాబితాలో చేర్చారు.