మరో 1,500 మంది టీచర్లకు ప్రమోషన్లు

మరో 1,500 మంది టీచర్లకు ప్రమోషన్లు

 హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉపాధ్యాయులకు ఇటీవల బదిలీలు, పదోన్నతులు కల్పించిన తర్వాత మిగిలిపోయిన ఖాళీలకు  ప్రమోషన్లు కల్పించేందుకు సర్కారు రెడీ అయింది. ఇప్పటికే జిల్లాల నుంచి సేకరించిన వివరాల ప్రకారం 1,500 మందికి ప్రమోషన్లు లభించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ శనివారం నిర్వహించనున్నది. ఇప్పటికే 19 వేల మంది టీచర్లకు పదోన్నతులు లభించాయి. 

అయితే, వివిధ కారణాలతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మిగిలిపోయాయి. లెఫ్ట్ ఓవర్ పోస్టులనూ ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని టీచర్ల సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయగా, సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో జిల్లాల్లో సబ్జెక్టులు, మీడియం, మేనేజ్​మెంట్లవారీగా డీఈవోల నుంచి ఖాళీల వివరాలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ అధికారులు సేకరించారు. 

ఈ పోస్టులకు శనివారం ఉదయం వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిర్వహించి, రాత్రి స్కూళ్ల పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తున్నది. సాధ్యం కాకపోతే ఆదివారం పోస్టింగులు ఇచ్చే చాన్స్​ ఉన్నది. ప్రస్తుతం 1500 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఎస్జీటీల ప్రమోషన్లతో భర్తీ చేయనున్నారు.