నల్ల బ్యాడ్జీలు ధరించి రిమ్స్ డాక్టర్ల నిరసన

నల్ల బ్యాడ్జీలు ధరించి రిమ్స్ డాక్టర్ల నిరసన

ఆదిలాబాద్, వెలుగు: నల్గొండ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ లో పర్యవేక్షణ కోసం ఇతర డిపార్ట్​మెంట్ అధికారులను రోస్టర్ పద్ధతిలో వేసి, రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను నిరసిస్తూ ఆదిలాబాద్ రిమ్స్ డాక్టర్లు శుక్రవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర డాక్టర్ల సంఘం పిలుపుమేరకు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. 

ఈ సందర్భంగా టీటీజీడీఏ రిమ్స్ అధ్యక్షుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ.. నల్గొండ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులు వైద్య ఉద్యోగుల నైతికతను ప్రశ్నించినట్లుగా ఉందన్నారు. ఎమర్జెన్సీ డిపార్ట్ మెంట్​పై ఇతర విభాగాల అధికారులు పర్యవేక్షణ చేసి రిపోర్ట్ పంపడం శోచనీయమన్నారు.  ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, వెంటనే ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్, కోశాధికారి డాక్టర్ కమలాకర్, ఉపాధ్యక్షురాలు డాక్టర్ సుమలత పాల్గొన్నారు.