రోడ్డుపై పశువులను తోలి ఆందోళన...కవ్వాల్​జోన్ లోకి ఫారెస్టు ఆఫీసర్ల ఆంక్షలతో నిరసన

రోడ్డుపై పశువులను తోలి ఆందోళన...కవ్వాల్​జోన్ లోకి ఫారెస్టు ఆఫీసర్ల ఆంక్షలతో నిరసన
  • వాహనాలను అనుమతించాలని బంద్ పాటించిన జన్నారం వ్యాపారులు

జన్నారం/జన్నారం రూరల్, వెలుగు: కవ్వాల్​టైగర్​జోన్​పరిధిలో పశువుల మేత, రాత్రిపూట వాహనాల రాకపోకలపై ఫారెస్టు అధికారులు ఆంక్షలు విధించడంతో ప్రజలు ఆందోళనబాట పట్టారు. మంగళవారం ఇందన్​పల్లి బీట్​పరిధిలో పశువులను మేపడానికి వెళ్లిన అలుగొట్టు రాజన్నను బీట్​ఆఫీసర్​రుబీనా కర్రతో కొట్టారు. దీనికి నిరసనగా రాజన్న, అతడి భార్య బుధవారం మంచిర్యాల -– ఆదిలాబాద్ –- నిర్మల్​మెయిన్​రోడ్డుపై పశువుల మందను తోలి రాస్తారోకో చేశారు.

దాదాపు రెండు గంటల పాటు ఆందోళన కొనసాగించారు. రెండు వైపులా ట్రాఫిక్​ జామ్ అయింది. ఎస్ ఐ రాజవర్ధన్ వెళ్లి ఇందన్​పల్లి ఎఫ్ఆర్వో శ్రీనివాస్​తో మాట్లాడిన అనంతరం రాజన్న దంపతులను సముదాయించి రాస్తారోకో విరమింపచేశారు. మరోవైపు కవ్వాల్​టైగర్​జోన్​లో రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలపై విధించిన ఆంక్షలను ఎత్తేయాలని డిమాండ్​చేస్తూ జన్నారం బంద్​చేపట్టారు.

వ్యాపారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు షాపులను మూసివేశారు. బీఆర్ఎస్​నేతలు, వ్యాపారులు ధర్నాకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. వాహనాల రాకపోకలపై ఆంక్షలను ఎత్తేయాలని ఖానాపూర్​ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు రెండు రోజుల కింద అటవీశాఖ మంత్రి కొండా సురేఖను కలిసి విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి ఫారెస్టు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయినా అధికారులు వాహనాలను అడ్డుకుంటున్నారని ప్రజలు మండిపడుతున్నారు.