గ్రూప్–1 అవకతవకలపై విచారణ జరపాలి..ఓయూలో మోకాళ్లపై నిల్చొని ఫ్లకార్డులతో నిరసన

గ్రూప్–1 అవకతవకలపై విచారణ జరపాలి..ఓయూలో మోకాళ్లపై నిల్చొని ఫ్లకార్డులతో నిరసన

ఓయూ, వెలుగు: గ్రూప్–1 పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయని, ప్రభుత్వం స్పందించి విచారణ జరపాలని ఓయూ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతిలాల్ డిమాండ్​చేశారు. సోమవారం వర్సిటీ క్యాంపస్​లో గ్రూప్–1 అభ్యర్థులతో కలిసి ఫ్లకార్డులతో మోకాళ్లపై నిల్చొని, అంబేద్కర్​ఫొటోకు మొక్కుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మోతిలాల్ నాయక్ మాట్లాడుతూ జీఓ నంబర్55తో ఉన్న నోటిఫికేషన్ జీఓ నంబర్​29తో ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. తర్వాత నుంచి జీఓ నంబర్ 55తో నోటిఫికేషన్లు ఎందుకు ఇస్తున్నారో టీజీ పీఎస్సీ వివరణ ఇవ్వాలని కోరారు. 21,093 మంది అభ్యర్థులు మెయిన్స్ రాస్తే 21,103 మంది ఎలా వచ్చారని మండిపడ్డారు. 18, 19 సెంటర్లలో మాత్రమే 74 మంది ఎలా సెలెక్ట్ అయ్యారని ప్రశ్నించారు.

తెలుగు మీడియం అభ్యర్థులు 7,800 మంది పరీక్ష రాస్తే పట్టుమని 10 మంది కూడా సెలెక్ట్ కాలేదని, అదే ఉర్దూ మీడియం అభ్యర్థులు తొమ్మిది మంది పరీక్ష రాస్తే ఏడుగురికి 450 పైచిలుకు మార్కులు ఎలా వచ్చాయని నిలదీశారు. క్వాలిఫై అయిన అభ్యర్థుల పూర్తి డేటాను, ప్రిలిమ్స్, మెయిన్స్ రాసిన అభ్యర్థుల డేటాను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 654 మందికి ఒకే రకమైన మార్కులు ఎలా వచ్చాయో వెంటనే సమాధానం చెప్పాలన్నారు. అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసిన తర్వాతనే ఈ నోటిఫికేషన్ మీద ప్రభుత్వం ముందుకు వెళ్లాలని కోరారు. లేకపోతే రాహుల్ గాంధీ మీద నల్ల టీ షర్టు ఉద్యమాన్ని ప్రారంభిస్తామని, వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు.