పాలమూరు యూనివర్సిటీకు వంద కోట్లు వచ్చినయ్​

పాలమూరు యూనివర్సిటీకు వంద కోట్లు వచ్చినయ్​
  • పీఎంయూఎస్​హెచ్ఏ కింద మంజూరు
  • హాస్టళ్లు, భవనాల నిర్మాణానికి రూ.78 కోట్లు కేటాయింపు
  • మైనర్​ రిపేర్లు, ల్యాబ్స్​ ఆధునికీకరణకు మిగిలిన ఫండ్స్

మహబూబ్​నగర్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీ (పీయూ)కి పెద్ద మొత్తంలో ఫండ్స్  వచ్చాయి. ప్రధాన మంత్రి శిక్ష ఉచ్ఛతర్  అభియాన్(పీఎంయూఎస్​హెచ్ఏ) స్కీం కింద రూ.వంద కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ.78 కోట్లు వర్సిటీలో కొత్త హాస్టళ్లు, బిల్డింగుల కోసం ఖర్చు చేయనున్నారు. భవనాలు, ఇతర మైనర్  రిపేర్ల కోసం రూ.3.60 కోట్లు, ల్యాబ్​లలో అత్యాధునిక పరికరాల కోసం రూ.14.26 కోట్లు, రీసెర్చ్, బోధన, శిక్షణ తదితర వాటి కోసం రూ.3.22 కోట్లు కేటాయించారు.

నిధుల కేటాయింపు ఇలా..

పీయూ దాదాపు 176 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం వర్సిటీకి పెద్ద మొత్తంలో ఫండ్స్​ రావడంతో డెవలప్​మెంట్​ వర్క్స్​ను త్వరలో మొదలుపెట్టనున్నారు. వర్సిటీకి ఇటీవల లా, ఇంజనీరింగ్​ కాలేజీలు శాంక్షన్​ కాగా, ఈ కాలేజీలకు సంబంధించి అడ్మినిస్ట్రేషన్, అకడమిక్, హాస్టళ్ల నిర్మాణానికి ఈ ఫండ్స్​ కేటాయించనున్నారు. అలాగే 20 బెడ్స్​తో హాస్పిటల్, ఇంక్యూబేషన్  సెంటర్, కొత్త ఆడిటోరియం నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉన్న లైబ్రెరీని విస్తరించనున్నారు. వనపర్తి పీజీ సెంటర్​లో హాస్టల్​ బిల్డింగ్, ఇండోర్​ స్టేడియం నిర్మించనున్నారు.

ఇందుకోసం దాదాపు రూ.78 కోట్లు ఖర్చు చేయనన్నారు. అలాగే సైన్స్​ ల్యాబ్స్​ కోసం దాదాపు రూ.14 కోట్లు కేటాయించారు. ఇందులో ట్రాన్స్​మిషన్​ ఎలక్ట్రో మైక్రోస్కోప్​ కోసం రూ.2 కోట్లు, ఎక్స్​రే ప్రొటో ఎలక్ట్రాన్​ స్పెక్ట్రో మీటర్​ కోసం రూ.కోటి, ఫ్లోరోసెన్స్​ మైక్రోస్కోప్​కు రూ.20 లక్షలు, ఫ్లాష్​ క్రొమెటోగ్రఫీకి రూ.25 లక్షలు, హెచ్​పీఎల్​సీ(3)కి రూ.60 లక్షలు, ఎఫ్టీఐఆర్(2)కు రూ.40 లక్షలు, హైస్పీడ్​ టేబుల్​ ప్రెస్​ మిషన్​కు రూ.15 లక్షలు, రోటో ఎవాపరేట్​ విత్​ చిల్లర్(4)కు రూ.5 లక్షలు, హెచ్​టీపీసీఎల్(2)కు రూ.25 లక్షలు, సెంట్రిఫ్యూజ్​కు రూ.25 లక్షలు, కోల్డ్​ స్టోరేజ్, టెంపరేచర్​ మానిటరింగ్​కు రూ.కోటి, జెల్​ డాక్యుమెంటేషన్​ విత్​ పీసీఆర్​ 2డీ జెల్​ ఎలక్ట్రోలసిస్​కు రూ.1.5 కోట్లు, యూవీ స్పెక్టోమీటర్​(6)కు రూ.6 లక్షలు, ఎన్ఎంఆర్​కు రూ.1.6 కోట్లు, స్కానింగ్​ ఎలక్ట్రాన్​ మైక్రోస్కోప్​కు రూ.కోటి, మోసబీయర్​ స్పెక్టోమీటర్​కు రూ.80 లక్షలు, పవర్​ సప్లయ్​ సిస్టంకు రూ.12 లక్షలు, లేటెస్ట్​ 13 జనరేషన్​ 200 కంప్యూటర్లకు రూ.2 కోట్లు కేటాయించారు. 

ప్రపోజల్స్ పంపిన ఐదు నెలల్లోనే..

సీఎం రేవంత్​రెడ్డి సొంత జిల్లా అయిన మహబూబ్​నగర్​లోని పీయూను గత ప్రభుత్వం గాలికొదిలేసింది. దీంతో దాదాపు పదేండ్లుగా ఇక్కడ సమస్యలు తిష్ట వేశాయి. సరైన బిల్డింగులు లేవు. స్టూడెంట్లకు తగ్గినన్ని హాస్టళ్లు లేవు. మౌలిక వసతులు, ఇతరత్రా సమస్యలున్నాయి. ఈ నేపథ్యంలో 2023 డిసెంబర్​లో పీఎంయూఎస్​హెచ్ఏ స్కీమ్​కు అప్లై చేసుకోవాలని దేశంలోని అన్ని వర్సిటీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి.

అప్పటికే మహబూబ్​నగర్​ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పీయూ ఆఫీసర్లను డెవలప్​మెంట్​ పనులకు సంబంధించిన ప్రపోజల్స్​ రెడీ చేయాలని ఆదేశించారు. వారు ప్రపోజల్స్​ తయారు చేసి రాష్ట్ర సర్కారుకు అందించగా, ఈ ప్రపోజల్స్​ను సీఎం యూఎస్​హెచ్ఏ రాష్ట్ర కో ఆర్డినేటర్​ ద్వారా కేంద్రానికి పంపారు. అనంతరం ఎమ్మెల్యే యెన్నం ఢిల్లీకి వెళ్లి స్కీం కింద వర్సిటీని ఎంపిక చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఫిబ్రవరిలో దేశంలోని 26 వర్సిటీలను ఈ స్కీ కింద ఎంపిక చేయగా, అందులో పీయూకు కూడా చోటు కల్పించారు. ప్రపోజల్స్​ పంపిన ఐదు నెలల్లోనే వర్సిటీకి రూ.వంద కోట్లు శాంక్షన్​ చేశారు.

పీయూ హిస్టరీలోనే రికార్డ్..​

గత బీఆర్ఎస్​ ప్రభుత్వం వర్సిటీకి కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో ఫెయిల్​ అయ్యింది. రాష్ట్ర బడ్జెట్​ కేటయింపుల్లోనూ ఈ వర్సిటీకి పదేండ్లుగా ప్రియారిటీ ఇవ్వలేదు. కేవలం జీతాలకు తప్ప, డెవలప్​మెంట్​కు తక్కువ నిధులు కేటాయించింది. 2017లో కేంద్రం నుంచి రూసా స్కీం కింద రూ.18 కోట్లు రాగా, ఆ ఫండ్స్​తో కొంత అభివృద్ధి జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి సీఎం నల్లారి కిరణ్​కుమార్​ రెడ్డి పీయూకు అత్యధికంగా 2012–13 రాష్ట్ర బడ్జెట్​లో రూ.16 కోట్లు మంజూరు చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు పెద్ద మొత్తంలో డెవలప్​మెంట్​కు నిధులు రాలేదు. 11 ఏండ్ల తర్వాత ఎమ్మెల్యే యెన్నం వర్సిటీకి రికార్డు స్థాయిలో రూ.వంద కోట్ల నిధులు తీసుకురావడంలో సక్సెస్​ అయ్యారు.

హ్యాపీగా ఉంది..

వర్సిటీలో ఇప్పటి వరకు స్టూడెంట్లకు సరిపడా హాస్టల్స్​ లేవు. బాత్ రూమ్స్​కు డోర్లు కూడా లేవు. స్టూడెంట్లకు అనుగుణంగా రెండు బాయ్స్ హాస్టల్స్​ కట్టించాలి.​ పీఎంయూఎస్​హెచ్ఏ స్కీం కింద వర్సిటీకి రూ.వంద కోట్లు మంజూరు​కావడం హ్యాపీగా ఉంది. 

గణేశ్, ఎంఎస్​ఎఫ్​ పీయూ ప్రెసిడెంట్​

రీసెర్చ్  బిల్డింగ్  కట్టాలి.. 

వర్సిటీలో రీసెర్చ్​ బిల్డింగ్​ కట్టాలి. స్పోర్ట్స్ కు నిధులు కేటాయించాలి. ఎస్టీ గర్ల్స్, బాయ్స్​కు వేర్వేరుగా హాస్టల్  నిర్మాణానికి గతంలో ఫండ్స్​ వచ్చాయి. కానీ, ఇప్పటి వరకు ఈ బిల్డింగ్​ను కట్టలేదు. వాటికి నిధులు కేటాయించి బిల్డింగ్​ను కట్టించాలి. అలాగే షటిల్, బ్యాడ్మింటన్​ కోర్ట్​లను ఏర్పాటు చేయాలి.

రూప్​ సింగ్, బీఎస్ఎం పీయూ ప్రెసిడెంట్