
సిద్దిపేట, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఆఖరి రోజైన మంగళవారం గజ్వేల్ పట్టణంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభను నిర్వహిస్తోంది. సోమవారం ఐఓసీ సమీపంలోని పదెకరాల స్థలంలో నిర్వహించే సభకు సీఎం కేసీఆర్ హాజరవుతున్నారు. నెలరోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్రచార సభల్లో పాల్గొంటున్న కేసీఆర్ తాను పోటీ చేస్తున్న గజ్వేల్ సభతో ప్రచార పర్వానికి ముగింపు పలుకనున్నారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల నుంచి దాదాపు యాభై వేల మంది జనాలను సమీకరించే లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ వరంగల్ సభ అనంతరం హెలిక్యాప్టర్ లో గజ్వేల్లో జరిగే సభకు హాజరై ఎన్నికల నిబంధనల ప్రకారం 5 గంటల వరకు ప్రచారం ముగించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.