- పబ్లిక్ రిలేషన్కు ప్రాధాన్యం పెరుగుతోంది
- ‘ట్రెండ్స్ ఇన్ పీఆర్ఇన్ 2023’ కార్యక్రమంలో నిపుణుల వెల్లడి
హైదరాబాద్, వెలుగు: సోషల్ మీడియాలో తప్పుడు వార్తల ప్రచారం ప్రమాదకర రీతిలో పెరిగిపోయిందని, దీంతో పబ్లిక్ రిలేషన్స్ కు ప్రాధాన్యత పెరిగిందని నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థుతుల్లో ఏ సంస్థ అయినా సోషల్ మీడియా ప్రచారాలపై స్పందించేందుకు, సరైన సమాచారాన్ని ప్రజలకు తెలియజెప్పేందుకు పీఆర్ టీంలపైనే ఆధారపడుతున్నాయని వివరించారు. ఈమేరకు సోమవారం పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ, హైదరాబాద్ బ్రాంచి, సెయింట్ జోసెఫ్ డిగ్రీ, పీజీ కాలేజీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిపుణులు మాట్లాడారు. 2023లో ట్రెండ్స్ ఇన్ పీఆర్ పేరుతో జరిగిన ఈ ప్రోగ్రాంలో పీఆర్, కమ్యూనికేషన్ రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న నిపుణులు డాక్టర్ రోహిత్ రాజ్ మాథూర్ (ఆయన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఓఎస్డీ), రామచంద్రం (సోలస్ మీడియా ఫౌండర్) ప్రసంగించారు. పీఆర్ అండ్ కమ్యూనికేషన్ నిపుణులు, సెయింట్ జోసెఫ్ కాలేజీ ఫ్యాకల్టీ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
రెప్యుటేషన్ నిలబెట్టుకోవడంపైనే..
ఈ డిజిటల్ యుగంలో ఒక సంస్థ మనుగడ దాని గౌ రవం, జనంలో తనపై ఉన్న నమ్మకాన్ని కాపాడుకోవడంపైనే ఆధారపడి ఉందని డాక్టర్ మాథూర్ స్పష్టం చేశారు. రెప్యూటేషన్ పోగొట్టుకుంటే ఇక భవిష్యత్తు అనేదే లేకుండా పోతుందని తెలిపారు. స్కిల్స్ పెంచుకోవాలి..పబ్లిక్ రిలేషన్ రంగానికి ప్రాధాన్యత పెరిగిన నేపథ్యంలో ఈ రంగంలో ప్రొఫెషనల్ గా స్థిరపడాలని అనుకునే వారికి సోలస్ మీడియా ఫౌండర్ డి.రామచంద్రం పలు సూచనలు చేశారు. అన్నింట్లోకి ముఖ్యమైంది.. విషయం ఏదైనా సరే, సోషల్ మీడియాలో దానిని వైరల్ గా మార్చేయగల నైపుణ్యం ఉండాలని చెప్పారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ జాతీయ ప్రధాన కార్యదర్శి వై.బాబ్జీ, సొసైటీ హైదరాబాద్ చైర్మన్ డాక్టర్ ఎస్.రాము ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. పీఆర్ రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకొని నిలబడేందుకు అవసరమైన నైపుణ్యాలను అలవర్చుకోవాలని సూచించారు. ప్రోగ్రాంలో సొసైటీ హైదరాబాద్ బ్రాంచ్ కార్యదర్శి యాదగిరి, జాయింట్ సెక్రెటరీ అపర్ణ రాజ్హాన్స్ మాట్లాడారు.